ఐసీసీలోని అక్రమాలను బహిర్గతం చేస్తా : ఐసీసీ అధ్యక్షుడు ముస్తఫా

మంగళవారం, 31 మార్చి 2015 (10:51 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో ఏం జరుగుతుందో బాహ్య ప్రపంచానికి తెలియజేస్తానని ఐసీసీ అధ్యక్షుడు ముస్తఫా కమల్ ప్రకటిచారు. వరల్డ్ కప్ ట్రోఫీని విజేతకు ఎవరు అందించాలన్న విషయంలోనూ ఐసీసీ ఛైర్మన్, ఐసీసీ అధ్యక్షుడికి మధ్య విభేదాలు పొడచూపిన విషయం తెల్సిందే. 2015 జనవరిలో సవరించిన నిబంధనల ప్రకారం గ్లోబల్ ఈవెంట్లలో బహుమతిని ఐసీసీ అధ్యక్షుడే అందించాలని ఉంది. కానీ, చివరి నిమిషంలో ఐసీసీ ఛైర్మన్ రంగ ప్రవేశం చేసి... విజేత జట్టుకు ఐసీసీ ట్రోఫీని అందజేశారు. దీంతో ఐసీసీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు ఒక్కసారి బయటపడ్డాయి. 
 
దీనిపై ముస్తఫా కమల్ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. 'ట్రోఫీని ఇవ్వాల్సింది నేను. ఐసీసీ రాజ్యాంగం నాకు అందించిన హక్కు అది. దురదృష్టవశాత్తు అందుకు నన్ను అనుమతించలేదు. నా హక్కులను కాలరాశారు. స్వదేశం (బంగ్లాదేశ్) వెళ్లిన తర్వాత, ఐసీసీలో ఏం జరుగుతోందన్న విషయం అందరికీ తెలియచెబుతా. వారి అవకతవకలపై ప్రపంచానికి తేటతెల్లం చేస్తా" అని పరోక్షంగా శ్రీనీ వర్గంపై ధ్వజమెత్తాడు. కమల్ అంతకుముందు, భారత్-బంగ్లాదేశ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అంపైర్లు పక్షపాతం ప్రదర్శించారని ఆరోపించిన సంగతి తెలిసిందే. టీమిండియాకు లాభించేలా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి