వైజాగ్ వేదికగా జరిగే ఐదో వన్డేలో నెగ్గిన జట్టుకు సిరీస్ దక్కుతుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లూ సిరీస్ డిసైడర్కు సిద్ధమయ్యాయి. కెప్టెన్సీ పరంగా కష్టకాలంలో ఉన్న ధోనీ ఎలాగైనా ఈ మ్యాచ్ నెగ్గి సిరీస్ విజయం అందుకోవాలని భావిస్తున్నాడు. మరోవైపు భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించాలని కివీస్ కుర్రోళ్లు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
వన్డే సిరీస్ను కైవసం చేసుకుని టెస్టుల్లో భారత చేతిలో 0-3తో వైట్వాష్కు ప్రతీకారం తీర్చుకోవాలని కివీస్ భావిస్తోంది. అయితే.. వైజాగ్లో 4-1తో మెరుగైన రికార్డు ఉండటం భారతకు కలిసొచ్చే అంశం. ఈ వేదికపై ఆడిన చివరి మ్యాచ్ (2014 అక్టోబర్లో వెస్టిండీస్తో వన్డే) హుద్హుద్ తుఫాను కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. ఇప్పుడు కూడా తుఫాను హెచ్చరిక నేపథ్యంలో మ్యాచ్ జరుగుతుందో లేదోనని ఇరు జట్లలో ఆందోళన నెలకొంది. ఈ మ్యాచ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.