ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో భారత్ ఘనవిజయం

మంగళవారం, 23 మార్చి 2021 (22:22 IST)
పుణే వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్, టీ20 సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ తొలి వన్డేలో గ్రాండ్ విక్టరీ కొట్టి శుభారంభం చేసింది. టీమిండియా నిర్దేశించిన భారీ టార్గెట్‌ను చేధించడంలో విఫలమైన ఇంగ్లండ్ జట్టు 251 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసి, ఇంగ్లండ్ ముందు 318 పరుగుల టార్గెట్ పెట్టగా.. 251 పరుగులకే ఇంగ్లండ్ జట్టు పెవిలియన్ చేరింది. దీంతో.. 66 పరుగుల తేడాతో.. ఇంగ్లండ్‌పై విజయం సాధించిన భారత్.. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.
 
ఇక, తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఏకంగా నలుగురు బ్యాట్స్‌మెన్‌ హాఫ్‌సెంచరీలతో చెలరేగిపోయారు. సెంచరీ చేస్తాడని అంతా భావిస్తున్న తరుణంలో ఓపెనర్ శిఖర్‌ ధావన్ తృటిలో సెంచరీ మిస్ అయ్యారు. 106బంతుల్లో 11 ఫోర్లు, 2సిక్సర్ల సహాయంతో 98 పరుగులు చేశాడు. ఇక, కెప్టెన్ విరాట్‌ కోహ్లీ 60 బంతుల్లో ఆరు ఫోర్లతో 56 పరుగులు చేయగా.. 43 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో చెలరేగిపోయిన కేఎల్‌ రాహుల్ 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు..
 
మరోవైపు.. 31 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో రెచ్చిపోయిన కృనాల్‌ పాండ్య 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇలా.. టీమిండియా బ్యాట్స్‌మెన్స్ వీరవిహారం చేయడంతో 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేశారు. ఇక, రోహిత్‌ శర్మ(28), శ్రేయస్‌ అయ్యర్‌(6), హార్దిక్‌ పాండ్య(1) మాత్రమే చేశారు. మొత్తంగా అన్ని ఫార్మాట్లలోనూ ఇంగ్లండ్‌పై ఆధిక్యాన్ని కనబరుస్తూ వస్తోంది టీమిండియా.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు