వరల్డ్ కప్ : పాక్‌పై 76 పరుగుల తేడాతో భారత్ గెలుపు..!

ఆదివారం, 15 ఫిబ్రవరి 2015 (17:05 IST)
క్రికెట్ ప్రపంచకప్‌లో గ్రూపు-బిలో భాగంగా, ఆడిలైడ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 76 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.  తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్ల‌లో ఏడు వికెట్లను కోల్పోయి 300 పరుగులు చేసింది. 
 
అనంతరం భారత్ నిర్దేశించిన 301 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ క్రికెటర్లు భారత్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక 47 ఓవర్లకే 10 వికెట్లను కోల్పోయి 224 పరుగులతో సరిపెట్టుకున్నారు. ఈ మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా విరాట్‌ కోహ్లి నిలిచారు. 

కాగా ఈ ఇన్నింగ్స్‌లో భారత్ విధించిన 301 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ను ప్రారంభించిన పాకిస్థాన్ క్రికెటర్లు రాణించలేకపోయారు. నాలుగో ఓవర్లో షమీ బౌలింగ్‌లో యూనిస్ ఖాన్ (6) కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 11 పరుగుల వద్ద పాక్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 36 పరుగులు చేసిన వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ సొహయిల్ రెండో వికెట్‌గా అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో సుడులు తిరుగుతూ వచ్చిన బంతిని సరిగా అంచనా వేయడంలో విఫలమైన సోహయిల్ స్లిప్స్‌లో రైనా చేతికి చిక్కాడు. 
 
పేసర్ ఉమేశ్ యాదవ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి పాక్‌ను చావుదెబ్బ కొట్టాడు. తొలుత, ఫాంలో ఉన్న ఓపెనర్ అహ్మద్ షేజాద్ (47)ను అవుట్ చేసిన యాదవ్ అదే ఓవర్లో షోయబ్ మక్సూద్ (0)ను డకౌట్ చేశాడు.
 
స్టార్ బ్యాట్స్‌మెన్ ఉమర్ అక్మల్ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. ఈ వికెట్ రవీంద్ర జడేజా ఖాతాలో చేరింది. జడేజా విసిరిన బంతి షార్ప్‌గా టర్నయింది. బ్యాట్‌ను రాసుకుంటూ వెళ్లిన బంతిని కీపర్ ధోనీ క్యాచ్ పట్టాడు. మిస్బా, యాసిర్ క్రీజులో ఉన్నారు. 
 
22 బంతుల్లో చకచకా 22 పరుగులు చేసిన అఫ్రిదిని షమీ పెవిలియన్ చేర్చాడు. షమీ విసిరిన ఫుల్ టాస్ బంతిని భారీ షాట్ ఆడబోయిన అఫ్రిది వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. షమీ అదే ఓవర్లో వాహబ్ రియాజ్ (4)ను కూడా అవు చేయడంతో పాక్ 154 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఇక ఆ తర్వాత బ్యాట్సమన్లు క్రీజులో నిలవలేకపోయారు. 47 ఓవర్లకే వికట్లెన్నీ సమర్పించుకుని 224 పరుగులతో పెవిలియన్ దారి పట్టారు. భారత్ - పాక్ మ్యాచ్ ఉత్కంఠతతో ఎదురుచూసిన భారత్ క్రికెట్ క్రీడాభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి