నేడు ఇండోర్‌లో మూడో వన్డే... తీవ్ర ఒత్తిడిలో ఆస్ట్రేలియా!

ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (11:06 IST)
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆదివారం కీలకమైన మూడో వన్డేకు ఇండోర్ సిద్ధమైంది. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తుండగా, రెండు వరుస ఓటములతో తీవ్ర ఒత్తిడిలోకి కూరుకుపోయిన ఆస్ట్రేలియా, ఈ మ్యాచ్ గెలిచి తమ సత్తా చాటాలని భావిస్తోంది. 
 
అయితే, బౌలింగ్‌పరంగా బాగా కనిపిస్తున్న టీమిండియా, బ్యాటింగ్‌లోనే పుంజుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పటివరకూ సిరీస్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ఏ ఆటగాడూ చూపలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ ఇంతవరకూ ఫామ్‌లోకి రాలేదు. మనీష్ పాండే సైతం తన దూకుడును చూపడంలో విఫలమవుతున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ సమస్య కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 
 
ఇక పర్యాటక ఆస్ట్రేలియా విషయానికి వస్తే, స్పిన్నర్లు చాహల్, కుల్ దీప్‌లను అడ్డుకోలేకపోతుండటం ఆ జట్టు మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగిస్తోంది. బ్యాటింగ్ భారం స్మిత్, వార్నర్‌లపై మాత్రమే పడుతోంది. వీరిద్దరూ అవుట్ అయితే, ఆస్ట్రేలియా విజయం సాధించడం క్లిష్టతరమవుతోంది.
 
ఇక ఇండోర్ మైదానం చిన్నది కావడంతో, పరుగుల వరద ఖాయమని, 300కు పైగా స్కోర్ నమోదైనా, దాన్ని సులువుగా అందుకోవచ్చని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్‌కి వర్షం ముప్పులేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు