రాంచీ టెస్ట్ మ్యాచ్ : అరంగేట్రంలోనే అదరగొట్టిన ఆకాష్ దీప్

వరుణ్

శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (11:47 IST)
రాంచీ వేదికగా భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ బౌలింగ్‌కు దిగింది. అయితే, ఈ టెస్టు ద్వారా అంతర్జాతీ టెస్ట్ అరంగేట్రం చేసిన ఆకాష్ దీప్ అదరగొట్టేశాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. అతను వేసిన తొలి ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ ఓవర్‌లోనే మూడు వికెట్లు నేలకూల్చాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రౌలీని బౌల్డ్ చేసిన ఆకాష్ దీప్.. ఆ తర్వాత బెన్ డకెట్‌ను ఔట్ చేశాడు.  
 
పిమ్మట ఓలీ పోప్‌ను ఎల్బీడబ్ల్యూగా ఇంటికి పంపించాడు. ఒక దశలో వికెట్ నష్టపోకుండా 47 పరుగులతో ఉన్న ఇంగ్లండ్.. 47 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 24.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఇందులో ఆకాష్ దీప్ మూడు వికెట్లు నేలకూల్చగా, అశ్విన్, జడేజాలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో జాక్ క్రౌలీ 42, బెన్ డకెట్ 11, ఒలీ పోప్ 0, జో రూట్ 16, జానీ బెయిర్‌స్టో 38, బెన్ స్టోక్స్ 3 చొప్పున పరుగులు చేశాడు.
 
రాంచి టెస్ట్ మ్యాచ్ : టాస్ గెలిచిన ఇంగ్లండ్... భారత్ బౌలింగ్ 
 
ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం నుంచి రాంచీ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య ప్రారంభమైంది. ఈ టెస్ట మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ బౌలింగ్‌కు దిగింది. అయితే, రాజ్‌కోట్‌ టెస్ట్ మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌తో పాటు ధ్రువ్ జురెల్‌లు టెస్ట్ మ్యాచ్ అరంగేట్రం చేయగా, రాంచీ మ్యాచ్‌లో నయా పేసర్ ఆకాశ్ దీప్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఈ కుర్రోడికి జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ బీసీసీఐ క్యాప్‌ను అందించి అభినందలు తెలిపాడు. జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో ఆకాశ్ దీప్‌కు అవకాశం లభించింది. 
 
కాగా, టాస్ ఓడిపోవడంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ, తాను టాస్ గెలిచివుంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడినని చెప్పాడు. పిచ్‌పై కొంచెం పొడిగా ఉండటంతో పాటు పగుళ్లు కనిపిస్తున్నాయన్నాడు. చివరి రెండు మ్యాచ్‌ల్లో బాగానే రాణించామన్నాడు. ఈ మ్యాచ్‌లోనే అదే తరహా ప్రదర్శన చేసి టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలిపాడు. జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారని, ప్రతి ఒక్క ఆటగాడు బాధ్యతాయుతంగా, సవాలుగా తీసుకుని ఆడుతున్నారన్నారు. వారి ప్రతిభ, నైపుణ్యాలపై తనకు గట్టి నమ్మకం ఉందన్నారు. ఆకాశ్ దీప్ అరంగేట్రం చేస్తున్నాడని, జట్టులో ఇదొక్కటే మార్పు అని చెప్పాడు. ఇప్పటివరకు జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌లలో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న విషయం తెల్సిందే. 
 
ఈ టెస్ట్ మ్యాచ్ కోసం బరిలోకి దిగిన ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే,
భారత జట్టు : యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, గిల్, రజత్ పటీదార్. సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, ఆర్.అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్. 
 
ఇంగ్లండ్ జట్టు : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, అలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు