శశికళకు సీఎం పదవి... తమిళనాడులో 234 జాబ్స్... స్పిన్నర్ అశ్విన్ పవర్ పంచ్

సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (14:23 IST)
తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తను సగటు అభిమాని నుంచి సెలెబ్రిటీల వరకు జీర్ణించుకోలేక పోతున్నారు. తాజాగా తమిళనాడు రాజకీయాలపై చెన్నై చిన్నోడు, భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో పంచ్‌లు విసిరాడు. 
 
ఇదే అంశంపై ఆయన సోమవారం ఓ ట్వీట్ చేశాడు. ‘త్వరలో రాష్ట్ర యువతకు 234 ఉద్యోగాలు రావడం ఖాయం’ అంటూ శశికళపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘తమిళనాడులోని యువకులందరికీ శుభవార్త... త్వరలో 234 ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి’’ అని పోస్టు చేశాడు.  తమిళనాడు అసెంబ్లీలో 235 అసెంబ్లీ స్థానాలు ఉండడంతో త్వరలో 234 ఉద్యోగాలు అంటూ అశ్విన్ చేసిన వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.
 
శశికళ నటరాజన్‌కు ముఖ్యమంత్రి పీఠం కట్టబెడుతూ ఆదివారం ఏఐఏడీఎంకే పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అశ్విన్ చేసిన ఈ వ్యాఖ్యలు... ట్విట్టర్‌లో పోస్టు చేసిన కొద్ది సేపటికే వైరల్‌లా వ్యాపించాయి. ‘‘నేను ఫ్యాన్ కాకపోయినప్పటికీ... 100 శాతం నీతో ఏకీభవిస్తాను’’ అంటూ ఓ నెటిజన్ స్పందించగా... ‘‘ఇవాల్టి నుంచి నేను నీకు పెద్ద అభిమానిని’’ అంటూ మరొకరు.. ఇలా వందలాది మంది అశ్విన్‌కి అభినందనలు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి