భారత క్రికెట్ జట్టు సోమవారం శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పిన్నర్లనే ప్రధానంగా నమ్ముకున్నాడు. ఈ టూర్లో భారత జట్టు మూడు టెస్ట మ్యాచ్లు ఆడనుంది. కోహ్లీకి ఇదే తొలి పూర్తిస్థాయి టెస్టు సిరీస్ కావడంతో అందరి దృష్టీ యువ కెప్టెన్పైనే కేంద్రీకృతమైంది. విరాట్ను కెప్టెన్గా ప్రకటించిన తర్వాత బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక టెస్టుకు నేతృత్వం వహించాడు. కోహ్లీ సారథ్యంలో ఆసీస్తో ఆడిన అయితే, ఈ పర్యటనకోసం జాతీయ సెలక్టర్లు స్పిన్నర్లకు పెద్దపీట వేశారు.
అయితే, ఉపఖండ పిచ్లను దృష్టిలో ఉంచుకుని అశ్విన్తోపాటు హర్భజన్, అమిత్ మిశ్రాలకు జట్టులో స్థానం లభించింది. లంక టూర్లో స్పిన్ ప్రధాన అస్త్రంగా భారత్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇటీవల పాకిస్థాన్తో జరిగిన టెస్టు సిరీస్లో స్పిన్ ఉచ్చులో చిక్కుకుని లంక విలవిల్లాడిన విషయంతెల్సిందే. ముఖ్యంగా పాక్ జట్టు 2-1తో టెస్టు సిరీస్ నెగ్గడంలో లెగ్ స్పిన్నర్ యాసిర్ షా కీలక పాత్ర పోషించాడు. మూడు టెస్టుల్లో యాసిర్.. 24 వికెట్లు సాధించాడు. దీంతో భారత జట్టు కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించనుంది.
మరోవైపు... సొంత గడ్డపై టెస్టు, వన్డే, టీ-20 సిరీస్లు చేజార్చుకున్న లంక టీమ్ ఆత్మవిశ్వాసం పాతాళానికి పడిపోయింది. ఎంతో కాలంగా జట్టుకు మూలస్తంభాలుగా ఉన్న జయవర్దనే ఇప్పటికే రిటైర్ కాగా, భారత్తో సిరీస్తో సంగక్కర దూరం కానున్నాడు. జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు కావడంతో అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అయితే ఉప ఖండంలోని ఆటగాళ్లు స్పిన్ ఆడడంలో దిట్టలే. కానీ పాక్తో సిరీస్లో మాత్రం స్పిన్ను ఎదుర్కోవడంలో లంక వైఫల్యం బట్టబయలైంది. దీంతో లంకేయులు ఆత్మరక్షణలో పడిపోయారు.