ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ టోర్నీలో భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యంత చెత్త ప్రదర్శన కనపరిచినప్పటికీ.. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకుల పట్టికలో కోహ్లీ ర్యాంకు మాత్రం స్థిరంగానే ఉంది. అదేసమయంలో భారతజట్టు ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మల స్థానాలు మాత్రం మెరుగుపడ్డాయి.
తాజాగా వెల్లడించిన ర్యాంకుల పట్టికలో ధావన్ 6వ స్థానంలో నిలవగా, రోహిత్ ఏకంగా ఏడు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. దాంతో ఆస్ట్రేలియా ఆటగాడు మైకేల్ క్లార్క్, పాకిస్థాన్ ఆటగాడు మిస్బాతో కలసి రోహిత్ 12వ ర్యాంకులో నిలిచాడు. ఇక విరాట్ కోహ్లీ తన నాలుగో స్థానంలోనే ఉన్నాడు. ఇటు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 8వ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.