తాజాగా శ్రీలంక మహిళా క్రికెట్లో లైంగిక వేధింపులు కలకలం సృష్టించాయి. జాతీయ జట్టులో ఉండాలంటే తమకు సెక్స్ సుఖం అందించాల్సిందేనని కొందరు బోర్డు అధికారులు మహిళా క్రికెటర్లను ఒత్తిడి చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై శ్రీలంక క్రికెట్ బోర్డు విచారణ చేపట్టగా, నివ్వెరపరిచే నిజాలు బయటపడ్డాయని దేశ క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జ్ నిమల్ దిసనాయకే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ఆరోపణలు నిజమని తేల్చింది. శ్రీలంక జాతీయ మహిళా జట్టులోని చాలామంది క్రికెటర్లు ఈ వేధింపుల బారినపడ్డారని కమిటీ పేర్కొంది. తప్పు చేసినవారిపై కఠినచర్యలు ఉంటాయని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. కమిటీ సమర్పించిన నివేదికలో తగిన ఆధారాలు ఉన్నాయని తెలిసింది.
ఇకపోతే శ్రీలంక మహిళా క్రికెట్ జట్టు వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో 1-3 తేడాతో పరాజయం పాలయ్యింది. అయినప్పటికీ వరల్డ్ వన్డే ర్యాంకింగ్స్లో ఆరో ర్యాంకులో ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్థాన్, ఇంగ్లండ్ క్రికెట్ టీమ్స్తో శ్రీలంక మహిళా జట్టు తలపడింది.