దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన ఐపీఎల్ రెండో అంచే పోటీల్లో లభించిన అనుభవం ప్రస్తుత ట్వంటీ-20 టోర్నీలో ఎంతో దోహదపడుతోందని శ్రీలంక కెప్టెన్, వికెట్ కీపర్ కుమార సంగక్కర అన్నాడు. ఇంగ్లండ్లో జరుగుతున్న ట్వంటీ-20 ప్రపంచ కప్లో సంగక్కర అద్భుతంగా రాణిస్తున్న విషయం తెల్సిందే.
ముఖ్యంగా, గ్రూపు మ్యాచ్లలో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో సంగక్కర కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీనిపై ఈ వికెట్ కీపర్ స్పందిస్తూ.. ఈ టోర్నీకి ముందు ఐపీఎల్లో పాల్గొనడం మంచి ప్రాక్టీస్ లభించినట్టయిందన్నాడు. అయితే, ఐపీఎల్లో పలువురు క్రికెటర్లకు రెగ్యులర్గా అవకాశాలు రాలేదని గుర్తు చేశాడు.
తమ జట్టు స్పిన్నర్ అజంతా మెండీస్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడినప్పటికీ, అవకాశం అంతంతమాత్రంగా లభించిందన్నాడు. అయితే, ఆసీస్తో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాణించి నాలుగు ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి, మూడు వికెట్లు పడగొట్టాడని చెప్పాడు. ఇలాంటిది అరుదుగా జరుగుతుందన్నాడు.
అయితే ట్వంటీ-20 ప్రాక్టీస్లో పెద్దగా పాలుపంచుకోని జట్టు ప్రపంచ ట్వంటీ-20 కప్లో సరిగా రాణించలేక పోతున్నాయన్నాడు. ఇందుకు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లే ప్రధాన ఉదాహరణ అని చెప్పుకొచ్చాడు.