వన్డే, టీ20ల్లో డీఆర్ఎస్‌ను ప్రయోగించాలి: పాంటింగ్

FILE
ఆస్ట్రేలియా-వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లో అమలవుతున్న నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్)ను వన్డే, టీ-20ల్లోనూ ప్రయోగించాలని ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ పద్ధతిని నేరుగా టెస్టుల్లో ప్రయోగించడం సరికాదని రికీ అన్నాడు. ఈ పద్ధతిని ఇంకాస్త మెరుగు పరచాల్సిన అవసరం ఉందన్నాడు.

డీఆర్ఎస్ పద్ధతి ద్వారా బ్రిస్బేన్‌లో జరిగిన రెండో టెస్టులో వీడియో సాక్ష్యం లేకున్నా, అంపైర్ మార్క్ బెన్సన్ తన నిర్ణయాన్ని తిరిగి మార్చుకోవలసి వచ్చిందని రికీ గుర్తు చేశాడు.

ఇలాంటి కొత్త పద్ధతి ఏదైనా అన్ని సందేహాలను నివృత్తి చేస్తూ.. నూటికి నూరు శాతం కచ్చితంగా ఉండాలని రికీ అన్నాడు. ఆటకు ఇలాంటి మార్పులు అవసరమైనప్పటికీ అంపైర్ల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని రికీ పాంటింగ్ అన్నాడు. వారిని చిన్నచూపు చూసేలా మార్పులు ఉండకూడదని రికీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఇదిలా ఉంటే.. ఈ నెల 16వ తేదీ నుంచి విండీస్‌తో జరిగే మూడో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టులో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. 12 మందితో కూడిన మార్పుల్లేని జట్టును ఆస్ట్రేలియా సెలక్టర్లు ప్రకటించారు. గాయంతో బాధపడుతున్న పేసర్ పీటర్ సిడెల్ సకాలంలో కోలుకుంటాడని జట్టు వర్గాలు తెలిపాయి.

వెబ్దునియా పై చదవండి