సొంత గడ్డపై ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్స్ కదంతొక్కారు. ఆ జట్టు కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ సెంచరీతో రాణించగా, ఓపెనర్ కుక్, పీటర్సన్లు తమ వంతు సహకారం అందించారు. ఫలితంగా తొలి రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది.
లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఈ టెస్టులో ఇంగ్లీష్ బ్యాట్స్మెన్లు ఆసీస్ బౌలింగ్ను ఓ ఆట ఆడుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు కుక్, స్ట్రాస్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. మూడు సెషన్ల పాటు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడిన స్ట్రాస్ 161 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.
స్ట్రాస్తో పాటు రాణించిన ఓపెనర్ కుక్ (95) సెంచరీని మూడు పరుగుల తేడాతో చేజార్చుకున్నాడు. కుక్, స్ట్రాస్తో కలిసి తొలి వికెట్ భాగస్వామ్యానికి 196 పరుగులు జోడించారు. ముఖ్యంగా మిచెల్ జాన్సన్ బౌలింగ్ను చీల్చిచెండారారు. జాన్సన్ 19 ఓవర్లు వేసి 107 పరుగులు సమర్పించుకున్నాడు.
అయితే, రెండు వికెట్లు పడగొట్టాడు. జాన్సన్తో పాటు పేస్ బౌలర్ హిల్ఫెన్హౌస్ రెండు వికెట్లు తీయగా, సైడల్, మైఖేల్ క్లార్క్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో రవి బొపరా (18), పీటర్సన్ (32), కాలింగ్ వుడ్ (16), ప్రియర్ (8), ఫ్లింటాఫ్ (4), బ్రాడ్ 7 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.