ఆస్ట్రేలియా పర్యటనలో సత్తా చాటేందుకు జహీర్ ఖాన్‌ సై!

శనివారం, 10 డిశెంబరు 2011 (15:26 IST)
ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు మూడుసార్లు బరిలోకి దిగినా ఒక్క సిరీస్‌ను కూడా పూర్తిగా ఆడలేని భారత స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ గాయం నుంచి పూర్తిగా కోలుకుని, ఆసీస్ టూర్‌లో సత్తా చాటుతానంటున్నాడు. ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా తన ఆటతీరులో వ్యత్యాసం కనుగొనవచ్చునని జహీర్ ఖాన్ తెలిపాడు.

మైదానంలో తాను మెరుగ్గా రాణించాలని అటు జట్టు సభ్యులు, ఇటు అభిమానులు ఆశిస్తున్నారని జహీర్ అన్నాడు. ఆసీస్‌ టూర్‌ వెళ్లేందుకు అన్నీ సిద్ధంగా ఉన్నాయని, ఇక తాను చేయాల్సిందంతా ధీటుగా ఆడటమేనని జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్‌లో భాగంగా ఒరిస్సాతో జరిగిన మ్యాచ్‌లో 22 ఓవర్లలో 52 పరుగులిచ్చి నాలుగు వికెట్లు సాధించిన జహీర్ ఖాన్, రాజ్‌కోట్ పేలవమైన పిచ్‌లోనూ 21 ఓవర్లకు బంతులు విసిరి 82 పరుగుల్లో మూడు వికెట్లు పడగొట్టడం గమనార్హం. రంజీ పోటీల్లో 40-45 ఓవర్ల వరకు బంతులు విసిరానని, అదే తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నాడు.

ఇంతకుముందు ఆసీస్‌తో కొన్ని మ్యాచ్‌ల్లో ఆడినప్పటికీ, ప్రస్తుతం నాలుగు నెలల విశ్రాంతికి తర్వాత మైదానంలో మెరుగ్గా బౌలింగ్ చేస్తాననే నమ్మకం ఏర్పడిందని జహీర్ చెప్పాడు. ఇంకా ఆస్ట్రేలియా టూర్ తనకు కీలకమన్నాడు.

వెబ్దునియా పై చదవండి