ఐపీఎల్ నుంచి వైదొలగనున్న రాయల్స్ సారథి షేన్ వార్న్!

రాజస్థాన్‌ రాయల్స్ సారథి షేన్ వార్న్ ప్రస్తుత సీజన్‌తో ఐపీఎల్‌లో ఆడటానికి ముగింపు పలకనున్నాడు. ఈ విషయాన్ని వార్న్ స్వయంగా వెల్లడించాడు. బిలియన్ డాలర్ల ట్వంటీ 20 ఐపీఎల్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో షేన్ వార్న్ కూడా ఒకడు. వార్న్ సారథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ ప్రారంభ సీజన్‌ ట్రోఫీని సాధించింది. ప్రస్తుత సీజన్‌లో మిగిలియున్న మ్యాచ్‌లు ముగిసిన అనంతరం తాను ఐపీఎల్ నుంచి వైదొలగుతున్నట్లు వార్న్ పాత్రికేయులకు తెలిపాడు.

వార్న్ ఆటగాడిగా వైదొలగుతున్నప్పటికీ వచ్చే సీజన్ నుంచి రాజస్థాన్ జట్టుకు సలహాదారుడిగా అందుబాటులో ఉండనున్నాడు. షేన్ వార్న్ తన లెగ్ స్పిన్‌తో ఆస్ట్రేలియా జట్టుకు అనేక విజయాలు అందించాడు. వార్న్ ఆస్ట్రేలియా జట్టు నుంచి రిటైర్ అయిన తర్వాత ఆ జట్టుకు మెరుగైన స్పిన్నర్ దొరకక స్పిన్ విభాగంలో పూడ్చలేని లోటు ఏర్పడింది.

వెబ్దునియా పై చదవండి