ఐపీఎల్ పదవి నాకొద్దు బాబోయ్..!: అలీఖాన్ పటౌడీ

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గవర్నింగ్ కౌన్సిల్‌లో తనికిచ్చిన పదవి నాకొద్దని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ప్రకటించారు. అలాగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నియమాలపైనా ఆయన చిటపటలాడారు.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)చే మార్పు చేసిన నియమాల ప్రకారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో పదవీ బాధ్యతలు చేపట్టే మాజీ క్రికెటర్లకు ఎలాంటి వేతనాలు ఇవ్వకపోవడంపై పటౌడీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో బీసీసీఐ ఇచ్చే పదవులు తనకొద్దన్నారు. గతంలో ఐపీఎల్ మాజీ ఛైర్మన్, లలిత్ మోడీ నాయకత్వంలోని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో పనిచేసే మాజీ క్రికెటర్లకు కోటి రూపాయలను వేతనంగా ఇచ్చేవారు. అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం వేతనాలివ్వకపోవడం సరికాదన్నారు.

ఇదేవిషయమై సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ఐపీఎల్ క్రికెట్ ముమ్మాటికీ వాణిజ్యమన్నారు. ఇందులో సేవాదృక్పథంతో పనిచేసే ప్రసక్తే లేదని గవాస్కర్ తేల్చి చెప్పారు. ఇంకా ఇందులో పదవీ బాధ్యతలు చేపట్టే వారికి వేతనాలివ్వడమే సరైన పద్ధతి అని సూచించారు. సీనియర్ క్రికెటర్లు ఇంత చెబుతున్నా.. రవిశాస్త్రి వంటి వెటర్న్ ఆటగాడు మాత్రం ఐపీఎల్‌కు ఉచితంగా సేవలు అందించేందుకు తన సేవానిరతని ప్రకటించడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి