కెరీర్లో అత్యంత క్లిష్టమైన టూర్లలో ఇది ఒకటి: ధోనీ
గాయాలతో పోరాడుతున్న జట్టు, వెంట వెంటనే రెండు ఓటములు, కీలకమైన అనుభవ ఆటగాళ్ల ఫామ్లేమి వంటి సమస్యలు ఎదుర్కొంటున్న భారత సారధి మహేంద్ర సింగ్ ధోనీ ఇంగ్లాండ్తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్ తన కెరీర్లో అత్యంత క్లిష్టతరమైన పర్యటనల్లో ఒకటని మంగవారం పేర్కొన్నాడు.
"గాయాలు, ఫిట్నెస్, ఫామ్, ప్రతి విషయం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇది అత్యంత కష్టమైన టూర్లలో ఒకటి" అని బుధవారం మూడో టెస్ట్ ప్రారంభమయ్యే ముందు ఏర్పాటు చేసిన పాత్రికేయల సమావేశంలో ధోనీ అన్నాడు.
ఇంగ్లాండ్ పర్యటన భారత క్రికెటర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొల్పింది. ఇక ధోనీ పరిస్థితి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇంటా బయటా విమర్శలే. కాగా మూడో టెస్ట్ జరిగే ఎడ్జ్బాస్టన్ మైదానం పేస్కు అనుకూలించే దృష్ట్యా నలుగురు మీడియం పేసర్లను తీసుకొనే అవకాశం కూడా లేకపోలేదని ధోని తెలిపాడు.
భారత్ ప్రస్తుతం శ్రీశాంత్, ఇషాంత్ శర్మ, ప్రవీణ్ కుమార్, మునాఫ్ పటేల్ రూపంలో నలుగురు ఫిట్నెస్ కలిగిన పేసర్లను కలిగివుంది. జహీర్ ఖాన్ స్థానంలో ఎంపికైన ఆర్పీ సింగ్ ఇంకా జట్టులో చేరలేదు.