దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ రద్దు!
బుధవారం, 9 డిశెంబరు 2009 (09:55 IST)
అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అగ్రస్థానంలో కొనసాగాలని భావిస్తున్న టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. త్వరలో దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మూడు టెస్టు మ్యాచ్లు రద్దు అయ్యాయి. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు చేసిన విజ్ఞప్తిని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అంగీకరించింది. ఫలితంగా వచ్చే యేడాది ఫిబ్రవరిలో స్వదేశంలో జరగాల్సిన మూడు టెస్టు మ్యాచ్లు రద్దు అయ్యాయి.
భారత్ పర్యటనకు వచ్చే సఫారీలు కేవలం వన్డే సిరీస్ మాత్రమే ఆడుతారు. బిజీ షెడ్యూల్ను దృష్టిలో పెట్టుకుని టెస్టు సిరీస్ను రద్దు చేయాలని బీసీసీఐకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేయడంతో ఈ టెస్టు సిరీస్ రద్దు అయింది. ఈ టెస్టు సిరీస్ను తర్వాత నిర్వహించే అవకాశాలు లేకపోలేదని దక్షిణాఫ్రికా క్రికెట్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ గెరాల్డ్ మజోలా చెప్పారు.
టెస్టు సిరీస్ను రద్దు చేసుకోవాలనే నిర్ణయం కొద్దికాలం క్రితమే తీసుకుందని, భారత్ తమను అధిగమించి నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడానికి, ఈ నిర్ణయానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ను 2-0తో కైవసం చేసుకోవడంతో భారత్ ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేరుకున్న విషయం తెల్సిందే.