నాకు బుకీతో సంబంధాలా?: కొట్టిపారేసిన సురేష్ రైనా

వెస్టిండీస్‌ టూర్‌కు భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ సారథ్యం వహించిన స్టార్ క్రికెటర్ సురేష్ రైనా వివాదంలో చిక్కుకున్నాడు. వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న భారత తాత్కాలిక కెప్టెన్ సురేష్ రైనా షిర్డీ సాయిబాబా దేవాలయాన్ని దర్శించుకున్నాడు. షిర్డీ సాయిబాబా దేవాలయంలో రైనా పక్కనే ఒక క్రికెట్ బుకీ ఉండటం విమర్శలకు తావిచ్చింది.

అయితే తనకు బుకీతో సంబంధాలున్నట్లు వస్తున్న వార్తలను రైనా కొట్టి పారేశాడు. షిర్డీ ఆలయంలో ఎంతో మంది తన పక్కన నిలబడి ఫోటోలకు దిగారని అందులో ఉన్న బుకీ ఎవరో తనకు తెలియదన్నాడు. బుకీతో సంబంధాలున్నట్లు మీడియాలో వార్తలు రావడం పట్ల రైనా మండిపడ్డాడు.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ ముగిసిన వెంటనే రైనా... కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ కుమార్తె పూర్ణా పటేల్‌తో కలిసి సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. దీంతో పలువురు అనేక రకాల ఊహాగానాలు చేశారు. ఈ సంఘటన జరిగిన ఐదు రోజులకు... రైనా పక్కన పూర్ణాతో పాటు క్రికెట్ బుకీ దీపక్ నారైణి అలియాస్ బాలాజీ ఉన్నాడనే ఫోటోలు బయటకు వచ్చాయి.

అయితే అతనెవరో తెలియదని వెస్టిండీస్‌లో ఉన్న రైనా ఖండించాడు. కానీ రైనా, పూర్ణా, బాలాజీ కలిసి సాయిబాబా పాదాలను కడి గిన దృశ్యాలను కొన్ని టీవీ చానళ్లు ప్రసారం చేశాయి. గత 2009 శ్రీలంక పర్యటనలో ఒక బుక్‌మేకర్ రైనాతో కనిపించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన ఐసీసీ రైనాకు క్లీన్ చిట్ ఇచ్చింది.

వెబ్దునియా పై చదవండి