నేపియర్ వన్డే: కివీస్ విజయలక్ష్యం 274

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాట్స్‌మెన్స్ రాణించారు. కివీస్ ముంగిట 274 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచారు. వర్షం కారణంగా యాభై ఓవర్ల మ్యాచ్‌ను 38 ఓవర్లకు కుదిరించారు. నిర్ణీత ఓవర్లలో భారత్ 273 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 89 బంతుల్లో ఆరు ఫోర్లతో 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

డాషింగ్ ఓపెన్ వీరేంద్ర సెహ్వాగ్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. 56 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 77 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా అద్భుతంగా బ్యాటింగ్ చేసి కేవలం 39 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 66 పరుగులు చేసి, కివీస్ బౌలర్ల భరతం పట్టాడు. ఫలితంగా భారత్ భారీ స్కోరు చేసింది.

అంతకుముందు టాస్ గెలిచిన ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన సచిన్, సెహ్వాగ్‌లు తొలి వికెట్‌కు 69 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి గట్టి పునాది వేశారు. సచిన్ వ్యక్తిగత స్కోరు 20 వద్ద అవుట్ కావడంతో ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ధోనీ ఆచితూచి ఆడుతూ వికెట్లు పడకుండా కాపాడాడు. మరోవైపు సెహ్వాగ్ బ్యాట్ ఝుళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. వెట్టోరి బౌలింగ్‌లో భారీ షాట్‌ కొట్టగా, టేలర్ అద్భుత క్యాచ్ పట్టడంతో సెహ్వాగ్ పెవిలియన్‌కు చేరాడు. అప్పటికి భారత్ స్కోరు 121.

తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన యువరాజ్ సింగ్ రెండు పరుగులకే రనౌట్ కావడంతో మరో పది పరుగుల అనంతరం మూడో వికెట్‌ను భారత్ కోల్పోయింది. అయితే సురేష్ రైనా, ధోనీలు మంచి సమన్వయంతో ఆడుతూ 110 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరు జట్టు సింగిల్స్ తీస్తూ, మధ్యమధ్యలో ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పెంచారు. ఫలితంగా 38 ఓవర్లలో భారత్ 273 పరుగులు చేసింది, కివీస్ బౌలర్లలో బుట్లర్, వెట్టోరి, ఇలియట్‌లు ఒక్కో వికెట్‌ చొప్పున తీశారు.

వెబ్దునియా పై చదవండి