జింబాబ్వే పర్యటనలో యువ క్రికెటర్ పర్వేజ్ రసూల్కు పూర్తి నిరాశ కలిగించడం పట్ల జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అసహనం, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జింబాబ్వే పర్యటనకు రసూల్ను ఎంపిక చేసిన బీసీసీఐ.. అతిని ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం ఇవ్వక పోవడం దారుణమన్నారు.
ఓ యువ క్రికెటర్ ఆత్మ స్థైర్యాన్ని జింబాబ్వే తీసుకెళ్లి దెబ్బతీస్తారా? అంటూ బీసీసీఐ తీరుపై ధ్వజమెత్తారు. స్వదేశంలో పక్కనబెట్టడం కంటే ఇది మరీ దారుణంగా ఉందని ట్విట్టర్లో ఘాటుగా విమర్శించారు.
తుది జట్టులో రసూల్కు అవకాశం కల్పించకపోవడాన్ని కేంద్ర మంత్రి శశి థరూర్ కూడా తప్పుబట్టారు. యువకులను పరీక్షించడానికే జింబాబ్వే సిరీస్ను ఉపయోగించుకున్నా... రసూల్ను ఒక్క మ్యాచ్ కూడా ఆడించకపోవడం నిరాశ కలిగించిందని జమ్మూ కాశ్మీర్ క్రికెట్ సంఘం వ్యాఖ్యానించింది.