మేమేంటో నిరూపిస్తాం: డివిలియర్స్ ధీమా

వన్డే క్రికెట్‌లో తమకు నెంబర్‌వన్ హోదాలో కొనసాగే అర్హత ఉందని దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దక్షిణాఫ్రికా అత్యుత్తమ జట్టు అని నిరూపించుకునేందుకు సమయం ఆసన్నమైందని చెప్పాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా నుంచి దక్షిణాఫ్రికా జట్టు నెంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

వన్డే ర్యాంకింగ్స్‌లో తమకు అగ్రస్థానంలో కొనసాగే అర్హత ఉందని నిరూపిస్తామని డివిలియర్స్ తాజాగా వ్యాఖ్యానించాడు. స్వదేశంలో త్వరలో జరగబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకొని తమ సత్తా చాటుతామన్నాడు. నెంబర్‌వన్ స్థానంలో ఉన్నప్పటికీ ఐసీసీ టోర్నమెంట్స్‌లో దక్షిణాఫ్రికాకు నిరాశపరిచే అలవాటు ఉన్న సంగతి తెలిసిందే.

ఈ అలవాటే తాజా ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆ జట్టుకు శాపంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో.. డివిలియర్స్ మాట్లాడుతూ.. స్వదేశంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంటామని నమ్మకం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా జట్టు ఈ కప్‌ను కైవసం చేసుకోవాలని కోరుకుంటున్నాను.

తద్వారా ప్రపంచంలో దక్షిణాఫ్రికాను అత్యుత్తమ జట్టుగా నిరూపించాలి. కొన్నిసార్లు చివరిదాకా వచ్చి ఐసీసీ కప్‌లు చేజార్చుకున్నాము. ప్రపంచంలో తమదే అత్యుత్తమ జట్టని మేము భావిస్తున్నాము. దీనిని నిరూపించేందుకు సరైన అవకాశం దొరికింది. దీనిని తాము సద్వినియోగపరుచుకుంటామని డివిలియర్స్ ధీమా వ్యక్తం చేశాడు.

వెబ్దునియా పై చదవండి