లంక జట్టుపై కాల్పులు : రాజపక్షే దిగ్ర్భాంతి

పాకిస్థాన్‌లో శ్రీలంక క్రికెట్ జట్టుపై దాడి జరగడంపై... శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షే దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వెంటనే లంక ఆటగాళ్లను హుటాహుటిన స్వదేశానికి రప్పించేందుకు పాక్ రాజకీయ నాయకులతో చర్చలు జరిపి ఏర్పాట్లను, ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు.

కాగా, పాకిస్థాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల రీత్యా గత రెండు సంవత్సరాలుగా ఏ దేశం కూడా... ఆ దేశంలో అడేందుకు ఆసక్తి చూపకపోయినప్పటికీ, లంక ధైర్యం చేసి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న లంక ఆటగాళ్లపై జరిగిన దాడిని ప్రపంచ క్రికెట్ బోర్డులన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి.

ఇదిలా ఉంటే... తాజా పరిస్థితులను బట్టి, పాక్‌ను ప్రపంచ క్రికెట్ నుంచి వెలివేసే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే, ఆటగాళ్లపై జరిగిన దాడిని ప్రపంచ క్రికెట్ బోర్డులన్నీ ముక్త కంఠం ఖండించటమేగాక, తీవ్రమైన చర్యగా భావిస్తున్నాయి. ఇదే గనుక జరిగినట్లయితే పాక్ క్రికెట్ బోర్డుకు, భారీగా నష్టం కలిగే అవకాశం ఉంది. అంతేగాకుండా, ఆ దేశ ఆటగాళ్ల క్రికెట్ భవిత ప్రశ్నార్థకంగా మారుతుంది.

వెబ్దునియా పై చదవండి