ఆస్ట్రేలియాతో సంప్రదాయ యాషెస్ సిరీస్లో భాగంగా గురువారం లార్డ్స్లో ప్రారంభమయ్యే రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఐదుగురు బౌలర్లతో బరిలో దిగనుంది. కార్డిఫ్లో జరిగిన యాషెస్ తొలి టెస్ట్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. లార్డ్స్ మైదానంలో ఘనమైన రికార్డు ఉన్న ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ ఈసారి ఎలాగైనా మట్టికరిపించాలనే పట్టుదలతో ఉంది.
ఇందుకోసం ఐదుగురు బౌలర్లతో బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇంగ్లండ్ కెప్టెన్ ఆండ్ర్యూ స్ట్రాస్ రెండో టెస్ట్ నేపథ్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆతిథ్య జట్టు ఈ టెస్ట్లో నలుగురు పేస్ బౌలర్లతో బరిలో దిగే అవకాశం ఉందని, ఆల్రౌండర్ ఆండ్ర్యూ ఫ్లింటాఫ్ ఫిట్నెస్ను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం ఉంటుందని తెలిపాడు.
ఫ్లింటాఫ్ గాయం నుంచి బాగా కోలుకున్నాడు. అతని ఫిట్నెస్పై ఆశాజనక సంకేతాలు వస్తున్నాయి. నలుగురు పేస్ బౌలర్లను తీసుకోవడం వలన ఫ్లింటాఫ్పై భారం తగ్గుతుందని తెలిపాడు. ఇదిలా ఉంటే బుధవారం యాషెస్ సిరీస్ తరువాత టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటానని ఫ్లింటాఫ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కార్డిఫ్ టెస్ట్లో గాయపడిన ఫ్లింటాఫ్ తరువాత బుధవారం తొలిసారి బౌలింగ్ ప్రాక్టీసు చేశాడు. ప్రస్తుతం గాయం నుంచి బయటపడ్డానని, రాత్రికి ఏం జరగకపోతే గురువారం టెస్ట్ మ్యాచ్కు సిద్ధంగా ఉంటానని చెప్పాడు. ఫ్లింటాఫ్ అందుబాటులో ఉంటే స్పిన్నర్ మాంటీ పనేసర్ను ఇంగ్లండ్ పక్కనబెట్టాలనుకుంటుంది. ఐదో బౌలర్ స్థానాన్ని స్టీవ్ హార్మిసన్ లేదా గ్రాహం ఆనియన్స్లో ఎవరో ఒకరు భర్తీ చేస్తారు.