వడోదరా సెంచరీ నాకు ప్రత్యేకం.!: కెప్టెన్ గౌతం గంభీర్

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో సాధించిన సెంచరీ తనకు ప్రత్యేకమని టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ గౌతం గంభీర్ అన్నాడు. కివీస్‌తో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను హ్యాట్రిక్ విజయంతో సొంతం చేసుకోవడం ద్వారానే ఈ సెంచరీ తనకు స్పెషల్ అని గంభీర్ చెప్పాడు. సిరీస్‌ను గెలుచుకునేలా చేసిన ఈ సెంచరీని ఎప్పటికీ మరిచిపోనని వడోదరా వన్డేలో ఒంటి చేత్తో జట్టును గెలిపించి, 126 పరుగులతో అజేయంగా నిలిచిన గౌతం గంభీర్ అన్నాడు.

మహేంద్ర సింగ్ ధోనీ విశ్రాంతి తీసుకోవడంతో టీమ్ ఇండియా వన్డే జట్టుకు కెప్టెన్సీ సారథ్యం వహించిన గంభీర్, కివీస్‌తో జరిగిన మూడు వన్డేల్లోనూ జట్టును సమర్థవంతంగా నడిపించాడు. మూడో వన్డే విజయానికి అనంతరం గంభీర్ మీడియాతో మాట్లాడుతూ..జహీర్ ఖాన్ నైపుణ్యత గల బౌలర్ అని కితాబిచ్చాడు.

మునాఫ్ పటేల్, అశ్విన్‌ల బౌలింగ్ కూడా అదిరిందని గంభీర్ కొనియాడాడు. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో గెలుచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కెప్టెన్ తెలిపాడు. అయితే దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు కివీస్‌తో 5-0 తేడాతో గెలవాలన్నదే ముఖ్యమని గంభీర్ వ్యాఖ్యానించాడు.

వెబ్దునియా పై చదవండి