శ్రీలంకకు బయలుదేరిన కొత్త పెళ్లికొడుకు మహేంద్రుడు!

FILE
శ్రీలంకతో జరుగనున్న క్రికెట్ సిరీస్‌లో పాల్గొనేందుకు టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శనివారం కొలంబోకు ప్రయాణమయ్యాడు. మద్రాసు క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సన్మాన కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండటంతో మహేంద్ర సింగ్ ధోనీ శుక్రవారం జట్టుతో కలిసి వెళ్లలేకపోయాడు.

జూలై 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టెస్టు మరియు ముక్కోణపు వన్డే సిరీస్‌ల్లో ఆడేందుకు శుక్రవారం టీమ్ ఇండియా కొలంబోకు ప్రయాణమైన సంగతి తెలిసిందే. కానీ శుక్రవారం రాత్రి ఎంసీసీ మహేంద్ర సింగ్ ధోనీ కోసం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ధోనీ-సాక్షి జంట పాల్గొంది.

ఈ కార్యక్రమంలో టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మద్రాస్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) సన్మానించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను విజేతగా నిలబెట్టిన మహేంద్ర సింగ్ ధోనీకి, 164 ఏళ్ల చరిత్ర కలిగిన ఎంసీసీ సభ్యత్వం కల్పించింది.

ఇకపోతే, జహీర్ ఖాన్ భుజం గాయంతో శ్రీలంకతో జరిగే క్రికెట్ సిరీస్‌కు దూరమయ్యాడు. జహీర్ ఖాన్ జట్టులో లేని లోటును తీర్చేందుకు శ్రీశాంత్, ఇషాంత్ శర్మలు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లపై గట్టిపోటీని ప్రదర్శించనున్నారు.

వెబ్దునియా పై చదవండి