వివాదాస్పద ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ఆండ్ర్యూ సైమండ్స్కు ఇప్పటికీ క్రికెట్ భవిష్యత్ ఉందని మాజీ ఆసీస్ క్రికెటర్ డారెన్ లీమన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సైమండ్స్కు ట్వంటీ- 20 క్రికెట్లో మెరుగైన భవిష్యత్ ఉందన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆండ్ర్యూ సైమండ్స్ హైదరాబాద్ డెక్కన్ ఛార్జర్స్ జట్టు తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ రెండో సీజన్ టైటిల్ను డెక్కన్ ఛార్జర్స్ చేజిక్కించుకుంది. ఈ జట్టుకు కోచ్గా డారెన్ లీమన్ వ్యవహరిస్తున్నారు. సైమండ్స్కు ఇప్పటికే హైదరాబాద్ జట్టులో చోటు ఉందని లీమన్ హామీ ఇచ్చారు. సైమండ్స్ విషయంలో తమకు ఎటువంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. అతనితో కలిసి ఆడటం తమకు సంతోషమేనన్నారు.
అతను సంతోషంగా, ఆరోగ్యంగా, మంచి ఫామ్లో ఉన్నాడా లేదా అనేదే తమకు ముఖ్యమని లీమన్ చెప్పారు. లీమన్ ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా సైమండ్స్ ప్రవర్తన బాగానే ఉందన్నారు. ఐపీఎల్లో అతను అంతర్జాతీయ వాతావరణంలో ఉండే ఒత్తిళ్లతో పోరాడాల్సిన అవసరం ఉండదని లీమన్ పేర్కొన్నారు.