తమ ఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్ లోటుతో జట్టు సమతూకం దెబ్బతిన్నదని ఫలితంగా తాము విఫలమైనట్టు ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. జట్టు నుంచి సైమండ్స్ను తొలగించిన ప్రభావం తమపై చూపిందన్నాడు.
ఇంగ్లండ్లో జరుగుతున్న ట్వంటీ-20 ప్రపంచ కప్ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు గ్రూపు దశ నుంచి ఇంటిముఖం పట్టిన విషయం తెల్సిందే. తొలుత వెస్టిండీస్ చేతిలోనూ, ఆ తర్వాత శ్రీలంక చేతిలో ఓటమిపాలై, టోర్నీ నుంచి నిష్క్రమించింది.
దీనిపై పాంటింగ్ మాట్లాడుతూ.. తమ జట్టు కూర్పుకూడా తీవ్ర నిరాశకు లోను చేసింది. ఏ తరహా క్రికెట్ ఫార్మెట్లో తీసుకున్నప్పటికీ, ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మెన్గా గుర్తింపుపొందిన ఆటగాడిని జట్టు కోల్పోవడం ఏ జట్టుకైనా తీరని నష్టం కలిగిస్తుందన్నారు. అంతేకాకుండా, టోర్నీలో సమిష్టిగా రాణించలేక పోయామన్నారు.
దీన్ని సాకుగా మేం చెప్పదలచుకులేదన్నారు. ఏపుడైతే ఒక మంచి ఆటగాడిని కోల్పోతారో.. ఆ ప్రభావం జట్టుపై తప్పకుండా పడుతుందన్నారు. అందుకే తామాడిన రెండు మ్యాచ్లలో పరాయజం పాలైనట్టు రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు.
జట్టు క్రమశిక్షణను ఉల్లఘించినందుకు గాను ఆండ్రూ సైమండ్స్పై క్రికెట్ ఆస్ట్రేలియా వేటు వేసి, స్వదేశానికి పంపించింది. టోర్నీ ఆరంభానికి ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడంతో ఆస్ట్రేలియాపై తీవ్ర ప్రభావం చూపింది.