స్పాట్ ఫిక్సింగ్: రియాజ్ వద్ద యార్డ్ పోలీసుల విచారణ!

స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ వద్ద స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు వచ్చేవారం విచారణ చేపట్టనున్నారు. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ రియాజ్‌ వద్ద వచ్చే మంగళవారం నాడు స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు విచారణ చేయనున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ ఇజాజ్ భట్ తెలిపారు.

స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణానికి సంబంధించి రియాజ్‌ను పోలీసులు ప్రశ్నించాలనుకుంటున్నారని భట్ వెల్లడించారు. ఇందుకుగాను మేము తేదీని ఖరారు చేశాం’ అని ఇజాజ్ బట్ లాహోర్‌లో విలేకరులతో చెప్పారు.

ఇదిలా ఉంటే బ్రిటీష్ పత్రిక ‘న్యూస్ ఆఫ్ ది వరల్డ్’ బట్టబయలు చేసిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో పోలీసుల విచారణను ఎదుర్కోనున్న నాలుగవ పాకిస్తాన్ క్రికెటర్ వహాబ్ రియాజ్ కావడం గమనార్హం. ఈ కుంభకోణానికి సంబంధించి పాకిస్తాన్ టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ సల్మాన్ బట్‌తో పాటు పేసర్లు మహ్మద్ అమీర్, మహ్మద్ ఆసిఫ్‌లను స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసులు గత నెలలో తొమ్మిది గంటలసేపు ప్రశ్నించిన విషయం విదితమే.

వెబ్దునియా పై చదవండి