అడిలైడ్ టెస్టు: రెచ్చిపోయిన బ్యాట్స్‌మెన్.. ఆసీస్ స్కోర్ 517/7

బుధవారం, 10 డిశెంబరు 2014 (17:25 IST)
అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ రెచ్చిపోయారు. ఒకరిని చూసి మరొకరు సెంచరీలు బాదేశారు. భారత బౌలర్ల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని చెలరేగిపోయారు. వెలుతురు లేక ఆట నిలిచిపోవడంతో రెండోరోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 517 పరుగుల భారీ స్కోరు చేశారు. 
 
తొలిరోజు ఆటలో వార్నర్ 145 పరుగులతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించగా.. రెండో రోజు వర్షం అంతరాయం కలిగించినా ఏమాత్రం లెక్కచేయకుండా క్లార్క్, స్మిత్ భారీగా పరుగుల వర్షం కురిపించారు. క్లార్క్ 128 పరుగులు చేసి కేవీ శర్మ బౌలింగులో పుజారాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
 
స్మిత్ మాత్రం తన పరుగుల దాహం ఇంకా తీరలేదన్నట్లు 162 పరుగులు చేసి ఇంకా నాటౌట్గానే మిగిలాడు. మిగిలిన వాళ్లలో ఒక్క మార్ష్ మినహా ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. 
 
ఇకపోతే.. భారత బౌలర్లలో షమీ, వరుణ్ ఆరోన్, కేవీ శర్మ రెండేసి వికెట్లు పంచుకోగా లంబూ ఇషాంత్ శర్మకు మాత్రం ఒక్క వికెట్టే దక్కింది. రెండోరోజు వర్షం అడ్డం పడటంతో కేవలం 31 ఓవర్లు మాత్రమే బౌలింగ్ జరిగింది. ఆట ముగిసే సమయానికి స్మిత్ 162 పరుగులతోను, జాన్సన్ 0 పరుగులతోను క్రీజులో ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి