భారత క్రికెట్ జట్టు కోచ్ డంకన్ ఫ్లెచర్ వ్యవహారంలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఉచిత సలహా ఇచ్చింది. కోచ్ ఎపిసోడ్లో జోక్యం చేసుకోవద్దంటూ క్లాస్ పీకింది. 2015 వరల్డ్ కప్ వరకు భారత కోచ్గా డంకన్ ఫ్లెచర్ కొనసాగుతారంటూ ధోనీ చేసిన వ్యాఖ్యలను బీసీసీఐ కొట్టిపారేసింది. అది ధోనీ వ్యక్తిగత అభిప్రాయమంటూ తీసిపారేసింది. ధోనీ ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా తన ఆట తీరును మెరుగుపరచుకునే విషయం మీద దృష్టిపెడితే మంచిదని సూచించింది.
టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీకి బిసిసిఐ షాక్ ఇచ్చింది. హెడ్ కోచ్ డంకెన్ ఫ్లెచర్ విషయంలో ధోనీ చేసిన వ్యాఖ్యను బిసిసిఐ కొట్టిపారేసింది. అది ధోనీ వ్యక్తిగత అభిప్రాయమంటూ తీసిపారేసింది. ఈ స్థితిలో భారత క్రికెట్ క్రీడలో మరోసారి ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైనట్లు క్రీడా పండితులు భావిస్తున్నారు. ఫలితంగా ధోనీ, బీసీసీఐ అధికారుల మధ్య దూరం క్రమంగా పెరుగుతున్నట్టు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి.
ధోనీకి బిసిసిఐ చాలా కాలంగా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ వస్తోంది. విదేశాల్లో ఎన్ని పర్యాయాలు విఫలమైనా, ఎంత ఘోరంగా పరాజయాలను ఎదుర్కొన్నా ధోనీ కెప్టెన్సీకిగానీ, జట్టులో అతని స్థానానికిగానీ ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. సుప్రీం కోర్టు ఆదేశాలతో బిసిసిఐ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగిన ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్ శ్రీనివాసన్తో ధోనీకి సత్సంబంధాలున్నాయి. అయితే ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఓటమితో ధోనీతో సంబంధాలను బీసీసీఐ కట్ చేసుకోనుందని సమాచారం.