ఇంగ్లండ్‌తో మూడో టెస్టు: శిఖర్ ధావన్ ప్లేసులో గంభీర్?

శుక్రవారం, 25 జులై 2014 (15:15 IST)
ఇంగ్లీష్ పిచ్‌లపై టీమిండియా స్టార్ బ్యాట్స్‌‌మన్ శిఖర్ ధావన్ తడబడుతుండటాన్ని జట్టు మేనేజ్‌మెంట్ గుర్తించింది. ఇందులో భాగంగా ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు టీమిండియాలో మార్పులు చేర్పులు చేయాల్సిందేననే నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో శిఖర్ ధావన్ ప్లేసులో గౌతం గంభీర్‌ను జట్టులోకి తీసుకోవాలనుకుంటోంది. 
 
అదే జరిగితే, మురళీ విజయ్ జతగా గంభీర్ సౌతాంప్టన్ టెస్టులో ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. 2011లో ఇంగ్లండ్ టూర్లో భారత్ జట్టు ఘోర వైఫల్యాలు చవిచూడగా, అప్పుడు గంభీర్ కూడా జట్టులో ఉన్నాడు. ఇటీవల దేశవాళీ పోటీల్లో రాణింపు గంభీర్‌కు మళ్ళీ టీమిండియాలో చోటు సంపాదించి పెట్టింది. ప్రస్తుత టూర్‌కు ఈ ఢిల్లీ క్రికెటర్‌ను రిజర్వ్ ఓపెనర్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 
 
కాగా, ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు సౌతాంప్టన్‌లో ఈనెల 27న ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్టు డ్రా కాగా, లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ 95 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించినట్లైంది. 

వెబ్దునియా పై చదవండి