భారత క్రికెట్ జట్టులో కెప్టెన్ ధోనీ వారసుడు ఒక్కరూ లేరా?

గురువారం, 21 ఆగస్టు 2014 (12:33 IST)
భారత క్రికెట్ జట్టు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అందువల్లే ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చరిత్రలో ఎన్నడూ లేని ఓటమిని చవిచూసింది. అలాగే, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇంగ్లండ్ చేతిలో వరుస ఓటములతో కెప్టెన్సీ సామర్థ్యాలు ప్రశ్నార్థకం మారింది కూడా. అయితే, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాత్రం అతనికి బాసటగా నిలిచింది. భారత మాజీ క్రికెటర్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా ధోనీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న దాఖలాల్లేవు. 
 
యువ క్రికెటర్ విరాట్ కోహ్లీని భావి కెప్టెన్‌గా కొన్నాళ్ళ క్రితం ఆకాశానికెత్తిన మాజీ క్రికెటర్లు ఇపుడు ఆ ఊసే ఎత్తడంలేదు. ఈ ఢిల్లీ స్టార్ ఫాం ప్రస్తుతం అత్యంత దారుణ స్థితిలో ఉన్నప్పటికీ తన ప్రియురాలిని మాత్రం వదిలిపెట్టడం లేదు. ఈ కారణంగా ధోనీ కంటే విరాట్ కోహ్లీపైనే ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. 
 
ఇదే అంశంపై బీసీసీఐ సెలక్షన్ కమిటీకి చీఫ్‌గా వ్యవహరించిన కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ కెప్టెన్ పదవికి వేరొకరు సిద్ధంగా లేకపోవడంతో ధోనీ పాలిట వరంగా మారింది. అయినా, ఈ విషయంలో మరోసారి పునరాలోచించాల్సిన సమయం వచ్చింది. అయినా, కెప్టెన్ పదవికి తగిన వారేరీ..? సమస్యంతా ఇక్కడే వస్తోంది అని శ్రీకాంత్ అన్నారు. ఏదేమైనా, వన్డే వరల్డ్ కప్ వరకు ధోనీ కెప్టెన్సీకి ఢోకా లేనట్టే. ప్రస్తుతం జట్టు నిర్మాణాత్మక దశలో ఉందన్న బీసీసీఐ వాదన ధోనీ పాలిట వరమైంది. 

వెబ్దునియా పై చదవండి