క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మృతికి ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ సంతాపం తెలిపారు. బౌన్సర్ తలకు బలంగా తాకడంతో మృత్యువుతో పోరాడుతూ హ్యూస్ గురువారం తుదిశ్వాస విడిచాడు. దీనిపై టోనీ అబాట్ స్పందిస్తూ.. "నేడు క్రికెట్ లోకానికి దుర్దినం అని, అతని కుటుంబానికి తీరని శోకం మిగిల్చిన రోజని" అని పేర్కొన్నాడు. అతడిని జట్టు సహచరులు, ఫ్యాన్స్ విశేషంగా అభిమానించారని తెలిపారు.
మరోవైపు.. హ్యూస్ మృతితో క్రికెట్ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఆస్టేలియా తరపున ఫిల్ హ్యూస్ 26 టెస్టులు, 25 వన్డేలు, ఒక ట్వంటీ 20 మ్యాచ్ ఆడాడు. డిసెంబర్ 4 నుంచి ఇండియాతో జరగనున్న టెస్టు సిరీస్ పిలుపు కోసం వేచిచూస్తున్న తరుణంలో ఈ దుర్ఘటన జరిగింది.