టీ-20నే కాదు వన్డే క్రికెట్ ఎలా ఆడాలో కూడా ఆసీస్‌కు నేర్పిన కౌర్

శుక్రవారం, 21 జులై 2017 (03:48 IST)
భారత మహిళా క్రికెట్‌లో ఒక స్టార్ ఆవిర్బవించిన వేళ.. ప్రపంచ క్రికెట్‌లో సాటిలేని మేటి దిగ్గజాలు ఆ వీరనారిని ప్రశంసలతో ముంచెత్తుతున్న వేళ. టీమిండియా మహిళా జట్టు రెండోసారి ప్రపంచ కప్ పైనల్లోకి అడుగుపెట్టిన వేళ. హర్మన్ ప్రీత్ కౌర్ అనే ఈ పంజాబ్ పుత్రిక తన పేరును క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ప్రపంచ క్రికెట్‌లో మెరుపు బ్యాటింగ్‌కు మారుపేరుగా నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్‌ను ఆదర్శంగా తీసుకున్న ఆ క్రీడాకారిణి ఇవ్వాళ తన భీకర బ్యాటింగుతో సెహ్వాగ్‌నే మరిపించింది. ఆ క్రీడా విన్యాసానికి దిగ్గజాలతో సహా క్రికెట్ ప్రపంచమే ఫిదా అయిపోతోంది. మిథాలీ రాజ్ మాత్రమే స్టార్ బ్యాట్మ్ వుమెన్‌గా వెలుగుతున్న భారత మహిళా క్రికెట్‌లో మెరుస్తున్న కొత్త సంచలనాల్లో సూపర్ సంచలనం హర్మన్ ప్రీత్ కౌర్.
 
మెరుపు వేగంతో కౌర్ బ్యాటింగ్‌ చేయడం, అలవోకగా బౌండరీలు, భారీ సిక్సర్లు బాదడం కొత్త కాదు. ఇది ఆమె సహజశైలి మాత్రమే. ఈ తరహా దూకుడైన బ్యాటింగ్‌ వల్లే బిగ్‌బాష్‌ జట్టు సిడ్నీ థండర్స్‌ హర్మన్‌ను ఏరికోరి ఎంచుకుంది. ఈ అవకాశం దక్కించుకున్న తొలి భారత క్రీడాకారిణి కౌర్‌ కావడం విశేషం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కౌర్‌ తొలి మ్యాచ్‌లోనే 28 బంతుల్లో 47 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆమె లాఫ్టెడ్‌ కవర్‌ డ్రైవ్‌ను అద్భుతమైన సిక్సర్‌గా మలచడం చూసి కామెంటరీలో ఉన్న గిల్‌క్రిస్ట్‌ ‘నేను చూసిన అత్యుత్తమ క్రికెట్‌ షాట్‌. ఆమె ఆటతో నేను అచ్చెరువొందాను’ అని వ్యాఖ్యానించడం విశేషం. 
 
గత ఏడాది అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై టి20ల్లో భారత్‌ అత్యుత్తమ లక్ష్య ఛేదనలో కూడా కౌర్‌ (31 బంతుల్లో 46)దే కీలక పాత్ర. టి20 క్రికెట్‌ ఎలా ఆడాలో కౌర్‌ తమకు చూపించిందని మ్యాచ్‌ తర్వాత ఆసీస్‌ కీపర్‌ ఎలీసా హీలీ చెప్పింది. ఇప్పుడు తాజా ఇన్నింగ్స్‌తో వన్డే క్రికెట్‌ ఎలా ఆడాలో కూడా ఆస్ట్రేలియన్లకు హర్మన్‌ బాగా నేర్పించింది!  తొమ్మిదేళ్ల క్రితమే భారత్‌ తరఫున తొలి మ్యాచ్‌ ఆడిన హర్మన్‌ చాలా వేగంగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. 2013లో జరిగిన గత ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌పై చేసిన సెంచరీ కౌర్‌కు మరింత గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ మ్యాచ్‌లో భారత్‌ ఓడినా ఆమె మెరుపు బ్యాటింగ్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురిసాయి.
 
గత ఫిబ్రవరిలో కొలంబోలో జరిగిన ప్రపంచ కప్‌ క్వాలిఫయర్‌ టోర్నీ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో విజయం కోసం చివరి 2 బంతుల్లో 8 పరుగులు కావాల్సిన దశలో ఆమె ఐదో బంతిని అద్భుతమైన సిక్సర్‌గా మలచడంతో పాటు మరో రెండు పరుగులు కూడా సాధించి గాల్లో బ్యాట్‌ విసిరేసి సంబరాలు చేసుకుంది. ఆ సమయంలో కుడి చేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న కౌర్‌ నొప్పిని భరిస్తూనే చివరి వరకు పట్టుదలగా ఆడి గెలిపించింది. ‘ఆ సమయంలో నన్ను నేను ధోనీలా భావించాను’ అని మ్యాచ్‌ అనంతరం కౌర్‌ వ్యాఖ్యానించింది.
 
వివిధ వయో విభాగాల్లో రాణించి పంజాబ్‌ జట్టులోకి వచ్చిన ఆమెకు భారత టీమ్‌ తలుపు తట్టడానికి ఎంతో సమయం పట్టలేదు. క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌ను పిచ్చి పిచ్చిగా అభిమానించే కౌర్, ఇప్పుడు ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సరిగ్గా అదే సెహ్వాగ్‌ను మరిపించింది.
 
బంతిని చూడటం, బలంగా బాదడమే తనకు తెలిసిన విద్య.  ‘టీవీలో నేను క్రికెట్‌ మ్యాచ్‌లు చూసిందే సెహ్వాగ్‌ కోసం. అతడిని తప్ప మరే ఆటగాడిని నేను అభిమానించలేదు. అతడు ఫోర్లు, సిక్సర్లు కొట్టే శైలి నాకు చాలా ఇష్టం. ఎన్నో సార్లు వీరూ షాట్లను ఆడే ప్రయత్నం కూడా చేశాను’ అని 28 ఏళ్ల కౌర్‌ తన ఆటపై ఎవరి ప్రభావం ఉందో చెప్పేసింది. బిగ్‌బాష్‌ తర్వాత తాజాగా ఇంగ్లండ్‌ టి20 సూపర్‌ లీగ్‌లో కూడా సర్రే స్టార్స్‌ తరఫున ఆడే అవకాశం హర్మన్‌కు దక్కింది.
 
మరొక్క అడ్డంకిని దాటుకుని ఆదివారం జరిగే ఫైనల్లో కూడా హర్ ప్రీత్ సింగ్ ఇలాగే  విజృభించి ఆడి ఇండియా  జట్టును గెలిపిస్తే  భారత మహిళా క్రికెట్‌ను ఇన్నేళ్లుగా ఒంటి చేత్తో మోసిన మిథాలీ రాజ్‌కు అపూర్వ గౌరవాన్ని కట్టబెట్టినట్లే అవుతుంది. 
 

వెబ్దునియా పై చదవండి