మొహాలీ టెస్టు: భారత్ తొలిరోజు స్కోరు 179/1

ఇంగ్లండ్‌తో మొహాలీలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు తొలి రోజు తొన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టానికి 179 పరుగులు చేసింది. తనకు అచ్చొచ్చిన మొహాలీ మైదానంలో ఓపెనర్ గౌతం గంభీర్ మరోమారు రాణించి, తన కెరీర్‌లో నాలుగో టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తం 229 బంతులు ఎదుర్కొన్న గంభీర్ 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 106 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

అలాగే.. ఫామ్‌లో లేక నాలుగు వైపుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న సీనియర్ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రావిడ్ కూడా ఈ టెస్టులో అద్భుతంగా రాణించాడు. జట్టు స్కోరు ఆరు పరుగుల వద్ద ఉండగా సెహ్వాగ్ (0) అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్‌లో క్రీజ్‌లోకి వచ్చిన రాహుల్.. ఆచితూచి ఆడుతూ మ్యాచ్‌ స్కోరును పెంచాడు. మొత్తం 205 బంతులను ఎదుర్కొన్న ద్రావిడ్ ఏడు ఫోర్లతో 65 పరుగులు చేసి క్రీజ్‌లో నాటౌట్‌గా నిలిచాడు.

ఇంగ్లీష్ బౌలర్లలో బ్రాడ్ ఒక వికెట్ పడగొట్టాడు. అయితే వెలుతురు సరిగా లేనికారణంగా మ్యాచ్‌ను నిర్ణీత సమయానికంటే ముందుగానే ప్రకటించారు. మొత్తం 90 ఓవర్లు ఆడాల్సి ఉండగా తొలి రోజున 72 ఓవర్ల ఆటమాత్రమే సాధ్యమైంది.

వెబ్దునియా పై చదవండి