ప్రాణం తీసిన సెల్ఫీ సరదా... వాగులో పడి బీటెక్ విద్యార్థి మృతి

శుక్రవారం, 23 జూన్ 2023 (11:31 IST)
సెల్ఫీ సరదా ఓ నిండు ప్రాణం తీసింది. బీటెక్ కుర్రోడు వాగులో పడి మృత్యువాతపడ్డాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లాలో ఈ నెల 22వ తేదీన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని కాజీపేటకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ (19) అనే యువకుడు స్థానికంగా ఉండే కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తన స్నేహితులు సయ్యద్ జాహెద్‌షా, అబ్దుల్ షాదాబ్‍తో కలిసి గురువారం ఉదయం ద్విచక్రవాహనంపై కంఠాత్మాకూర్ వాగు వద్దకు చేరుకుని, సెల్ఫీలు తీసుకుంటున్నారు. 
 
వాగులోని నీటిని నిల్వచేసేందుకు నిర్మించిన చిన్నపాటి కరకట్ట (చెక్ డ్యామ్) వద్ద సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోతుండటాన్ని గమనించిన ఇతర స్నేహితులు బిగ్గరగా అరిచారు. సయ్యద్ జాహెద్ షా, అబ్దుల్ షాదాద్‌లు బిగ్గరగా కేకలు వేశాడు. 
 
దీంతో అక్కడ ఉన్న ఇతరులు నీటిలో మునిగిపోతున్న ఇస్మాయిల్‌ను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న దామెర ఎస్ఐ రాజేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు