సూట్‌కేసులో భార్య మృతదేహం.. పూణెలో భర్త అరెస్టు!

ఠాగూర్

శుక్రవారం, 28 మార్చి 2025 (09:59 IST)
బెంగుళూరు నగరలోని హుళిమావులో ఒక ఇంట్లో సూట్‌కేసులో ఓ మహిళ మృతదేహం లభించింది. ఇది స్థానికంగా కలకలం రేపగా, ఈ కేసులో మృతురాలి భర్తను పూణెలో పోలీసులు అరెస్టు చేశారు. మృతురాలిని గౌరీ అనిల్ సంబేకర్ (32)గా గుర్తించారు. ఆమె భర్త రాకేశ్ సంబేకర్ ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పైగా, నిందితుడుని పూణెలో అదుపులోకి తీసుకున్నారు. కట్టుకున్న భార్యను హత్య చేసిన తర్వాత నిందితుడు మృతురాలి తల్లిదండ్రులకు చేసిన ఘాతుకాన్ని పోలీసులకు చెప్పడం గమనార్హం. మహారాష్ట్ర పోలీసుల నుంచి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే స్థానిక పోలీసుకు తెలియజేశారు. వారు హుటాహుటిన గౌరీ నివాసానికి చేరుకుని విచారణ చేపట్టారు. 
 
సాయంత్రం ఐదు గంటల సమయంలో తమకు ఫోన్ వచ్చిందని, వెంటనే హుళిమావు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని పోలీసులు తెలిపారు. వారు అక్కడకు వెళ్లేసరికి ఇంటికి తాళం వేసి ఉందని, తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా బాత్రూంలో ఒక సూట్‌కేసు కనిపించిందని వెల్లడించారు. ఫోరెన్సిక్ బృందం సూట్‌కేసును తెరిచి చూడగా గౌరీ మృతదేహం లభ్యమైందని వివరించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆమె మరణానికి గల కారణాలు తెలుస్తాయని వెల్లడించారు. 
 
మరోవైపు, గౌరీ భర్త రాకేశ్‌ను పోలీసులు అప్పటికే అరెస్టు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం నిందితుడుని బెంగుళూరుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు హుళిమావు పోలీసులు తెలిపారు. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, గౌరీ, రాకేశ్‌లు మహారాష్ట్రకు చెందిన వారు. రెండేళ్ల క్రితం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. నిందితుడు రాకేశ్ బెంగుళూరులోని ఓ ఐటీ కంపెనీలో ప్రాజెక్టు మేనేజరుగా పనిచేస్తుండగా, గౌరీ మాత్రం ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు