త్యాగవీరుల ఫలమే భారతావనికి స్వేచ్ఛా వాయువులు

సోమవారం, 15 ఆగస్టు 2011 (09:28 IST)
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో పెకళించి వేసేందుకు ఎందరో త్యాగమూర్తులు తమ ప్రాణాలను అర్పించారు. వారి త్యాగ ఫలితమే భరతజాతి స్వేచ్ఛా వాయువులను నిర్భయంగా పీల్చగలుగుతుంది. ఆనాటి ఫలాలను నేటి తరం స్వేచ్ఛగా అనుభవిస్తూ రోజురోజుకు అభివృద్ధి చెందుతూ ఇతర దేశాలతో పోటీపడుతుంది.

క్రీ.శ. 1600 సంవత్సరంలో బ్రిటీష్ పాలకులు వ్యాపార నిమిత్తం మన దేశానికి వచ్చి... విభజించు పాలించు అనే సూత్రాన్ని పక్కాగా అమలు చేసి భారతీయులపై అజమాయిషీ చేయడం మొదలుపెట్టారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పేరుతో మొదలుపెట్టిన వారి పరిపాలన సుమారు 200 సంవత్సరాల పాటు నిరంతరాయంగా నియంతృత్వ పోకడతో సాగింది. భారత సంపదను కొల్లగొట్టారు. ప్రజలను చిత్ర హింసలు పెట్టారు.

ఇందుకోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. అలాంటి వాటిలో 1857లో బ్రిటీష్ ప్రభుత్వంపై తొలి తిరుగుబాటు చేశారు. ఈ ఉద్యమాన్నే సిపాయిల తిరుగుబాటు అని, మొదటి స్వాతంత్య్ర ఉద్యమంగా మన చరిత్రలో ఉంది. ఈ విధంగా భారతదేశంలో రైతులు, అన్ని వర్గాలవారు, విద్యార్థులు, సామాన్య ప్రజానీకం ఏకమై పలుచోట్ల బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ స్వాతంత్య్ర కాంక్షను ప్రజల్లో రేకెత్తించారు.

"స్వరాజ్యమే నా జన్మహక్కు" అని ప్రకటించిన బాలగంగాధర తిలక్‌, లాలాలజపతిరాయ్‌, బిపిన్‌చంద్రపాల్‌, గోపాలకృష్ణ గోఖలే వంటి మహనీయులు సామాన్య ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపించారు. జాతిపిత మహాత్మా గాంధీ రాకతో స్వాతంత్య్రోద్యమంలో ఓ విప్లవాత్మకమైన మార్పు చోటు చేసుకుంది. "అహిసం" అనే ఆయుధంతో గాంధీజీ అందరిని కలుపుకుంటూ ఉద్యమాలకు ఊపిరి పోశారు.

1942లో చేపట్టిన క్విట్‌ ఇండియా ఉద్యమం ద్వారా బ్రిటీష్‌వారు స్వాతంత్య్రం ఇవ్వడానికి నిశ్చయించుకుంది. ఈ పరిస్థితుల్లో భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటుచేసి చివరకు 1947 ఆగస్టు 14 అర్థరాత్రి స్వాతంత్య్రం లభించింది. ఉత్తర, దక్షిణ భారతదేశంలో ఎంతో మంది మహాత్ములు తమ ప్రాణాలను అర్పించి స్వాతంత్య్రాన్ని సముపార్జించి పెట్టారు. ఈ స్వాతంత్ర్య ఫలాలను నేటి యువత భద్రంగా కాపాడుకోవడంలో విఫలమౌతుందనే చెప్పాలి.

వెబ్దునియా పై చదవండి