బాబుకు నందమూరి కుటుంబం "పోటు": బాలయ్య ప్రేక్షకుడు

శనివారం, 9 ఏప్రియల్ 2011 (17:29 IST)
WD
తెలుగుదేశం పార్టీ నిట్టనిలువునా చీలిపోబోతోందా...? చంద్రబాబు నాయుడు స్టీరింగ్‌ను నందమూరి కుటుంబం ఆక్రమించనుందా..? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అలానే ఉన్నట్లు కనబడుతోంది. 1995 నుంచి 2004 వరకూ ఆంధ్రాలో పొలిటికల్ హీరోలా చక్రం తిప్పిన బాబుకు కొత్తగా నందమూరి కుటుంబం పక్కలో బల్లెంలా మారింది.

వైఎస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావం అనంతరం ఆ ప్రభావం తెలుగుదేశం పార్టీలోనూ పడినట్లు కనబడుతోంది. దివంగత తెలుగుదేశం నేత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ రానురాను కళ తప్పుతోందన్న ఆందోళనలను కొంతమంది వ్యక్తం చేశారు.

మొన్న హరికృష్ణ పర్యటనలో దీనిపై అనేకనేక ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దాదాపు 30 ఏళ్లుగా ఉన్న తెలుగుదేశం పార్టీకి నిన్నగాక మొన్న వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెను సవాలుగా మారడమేమిటన్న వాదనలు సైతం తెరపైకి వచ్చినట్లు భోగట్టా.

ఈ నేపథ్యంలో హరికృష్ణ దీనిపై తీవ్రమైన ఆలోచనలో పడ్డట్లు సమాచారం. ఇదిలావుండగానే కేంద్రమంత్రి, నందమూరి తారక రామారావు కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి సంచలన ప్రకటన చేశారు. తన కుటుంబం అనే తనకు ఎంతో ప్రేమాభిమానాలున్నాయనీ, తన తండ్రి వారసుడు జూనియర్ ఎన్టీఆరేనని ప్రకటించారు. ఇది నందమూరి కుటుంబంలో ఒక్కసారి ప్రకంపనలు సృష్టించాయి.

ఆ మరుసటి రోజు యువరత్న బాలకృష్ణ బహిరంగ లేఖాస్త్రం సంధించారు. సినిమాలు తీసుకుంటూ తన పనేదో తను చేసుకుంటూ పోతున్నాననీ, తనను వివాదాల్లోకి లాగవద్దని విన్నవించుకున్నారు. దీనిపై హరికృష్ణ సీరియస్ అయ్యారు. కుటుంబ సభ్యులతో మాటమాత్రం చెప్పకుండా మీడియాకు లేఖ విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని బాలయ్యను ప్రశ్నించారు.

ఇంకోవైపు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ అనుసరిస్తున్న వైఖరిని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తప్పుబట్టారు. మొత్తమ్మీద తాజాగా జరుగుతున్న సంఘటనలను బట్టి చూస్తే ఒక్క బాలకృష్ణ తప్పించి మిగిలిన కుటుంబమంతా నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేక దిశలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం టీ కప్పులో తుఫానులా సమసిపోతుందో... లేక జపాన్ సునామీలా బాబు కుర్చీని లాగేసుకుంటుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి