విజయవాడ: ఏదైనా బాగున్నంత సేపూ సవ్యంగానే సాగిపోతుంది. తేడా వస్తే అంతా తిరకాసే. టీడీపీ, బీజేపీ మధ్య ఇదే తేడా కనిపిస్తోంది. పొత్తు పెట్టుకుని ఏపీ ఎన్నికల్లో గెలిచి రెండేళ్ళు పూర్తికాలేదు. అపుడే మిత్రుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. వాటిని ఎంత కప్పిపుచ్చుకుని సరిదిద్దుకుందామని చూసినా... చిరిగి చేట అవుతూనే ఉన్నాయి. ఏపీకి బీజేపీ ఏం చేసింది... కేంద్రం నిధులు ఇవ్వకుండా ఇబ్బందిపెడుతోందని ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగంగానే నిరసన తెలిపారు.
ఈ నేపథ్యంలో తాము ఏపీకి ఇప్పటివరకు లక్షన్నర కోట్ల రూపాయల వరకు నిధులు కేటాయించామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లెక్కలు తేల్చారు. ఇంతకన్నా ఏమి కావాలి అంటూ, సవాలు చేశారు. అది తప్పు... మాకు ఇప్పటికి ఇచ్చింది కేవలం 4,5 వేల కోట్లు మాత్రమే అని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. రాజధానికి ఇచ్చింది కేవలం 550 కోట్లు మాత్రమే అని టీడీపీ మంత్రులు స్పష్టం చేశారు. దీనితో బీజేపీ నేతలకు చిర్రెత్తినట్లుంది.
కేంద్రం ఇచ్చిన నిధులు... వాటిని టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న తీరుపై కౌంటర్చెక్ ప్రారంభించారు. ముఖ్యంగా స్థానిక బీజేపీ నేతలు టీడీపీ ప్రభుత్వం చేసే పనులను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. అటు అమరావతిలోనూ, ఇటు తాత్కాలిక రజధాని విజయవాడలోనూ పెద్ద ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నారు. ఆ పనులు ఎలా జరుగుతున్నాయి? కాంట్రాక్టర్ ఎవరు? పనుల్లో నాణ్యత లోపం...ఏవన్నా కమిషన్లు ఉన్నాయా? అనే కోణంలో పరిశీలన చేస్తున్నారు.
విజయవాడలో దుర్గగుడి వద్ద ఫ్లైవోవర్ నిర్మాణం పనులపై బీజేపీ నేతలు కన్నేశారు. దాదాపు 500 కోట్ల రూపాయలతో జరుగుతున్న ఈ పనులు ఎలా జరుగుతున్నాయో అని శుక్రవారం పరిశీలన చేశారు. ఫ్లయివోవర్ నిర్మాణ పనులను సోమా కనస్ట్రక్షన్ నిర్వహిస్తోంది. ఆ ఒక్క కంపెనీకే 333 కోట్ల రూపాయల కాంట్రాక్టు అప్పగించారు. అయితే, ఇక్కడ పనులు సరిగా జరగడం లేదని బీజేపీ బృందం తేల్చింది. అక్రమాలు చాలానే ఉన్నాయని, టెండర్ మొదలుకొని, పనుల్లో నాణ్యత వరకూ అన్నింటిపైనా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని బీజేపీ మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. మిత్రపక్షంగా, టీడీపీ చేసే ప్రతి పనికీ తల ఊపే పరిస్థితి ఇపుడు రాష్ట్రంలో లేదని అవగతమవుతోంది.