యుద్ధం మొదలైంది... దేవినేని ఉమాకు దెబ్బపడుతుందా?

బుధవారం, 12 జూన్ 2019 (10:18 IST)
వైఎస్ జగన్ అవినీతి రహితపాలన, పూర్తి పారదర్శకతతో కూడిన పరిపాలన ప్రజలకు అందిస్తామని ఘంటాపథంగా చెపుతున్నారు. తన మంత్రివర్గ సహచరులకు అధికారులకు గత ప్రభుత్వం చేసిన స్కాంలు, ప్రాజెక్టులలో జరిగిన అవినీతి అంశాలను వెలికితీస్తే వారికి సన్మానాల చేస్తానని స్వయంగా చెబుతున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసి దేవినేని ఉమాను టార్గెట్ చేసింది. 
 
దేవినేని ఉమా తెలుగుదేశం ప్రభుత్వంలో సీనియర్ నేతగా వ్యవహరించేవారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఉమా 2014లో చంద్రబాబు క్యాబినెట్లో తొలిసారి మంత్రి అయ్యారు. అత్యంత కీలకమైన ఇరిగేషన్ శాఖను నిర్వహించి. ఇరిగేషన్ శాఖలో, నీరు చెట్టు పనుల కింద దాదాపు 60 వేల కోట్లు ఖర్చు పెట్టారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు ఉమా చేతుల మీదుగానే వేల కోట్లు ఖర్చుపెట్టారు. ఇరిగేషన్‌కు ప్రధమ ప్రాధాన్యం పేరుతో నిబంధనలు పక్కన పెట్టి మరీ తన వారికి పనులు అప్పగించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. 
 
ప్రజా ప్రయోజనాల కోసం అని చెపుతూ వందల కోట్ల పనులు కూడా నామినేషన్లో ఇచ్చేశారు. ఆనాటి నిర్ణయాలకు, అప్పటి తప్పులకు ఇప్పుడు ఉమా మూల్యం చెల్లించుకోబోతున్నారా.... అంటే అవుననే సమాధానం వస్తుంది. ఉమా హయాంలో జరిగిన అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. వీటిపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వివిధ ఏజెన్సీలకు వెళ్లాయి. మరోవైపు ఉమా విషయంలో పక్కా ప్లానింగ్‌తో ఉన్న ప్రత్యర్థి వర్గం ఆనాటి పనుల్లో అక్రమాలను కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. 
 
దీంతో కేంద్ర నిఘా వర్గాలు... ఆయా ఏజెన్సీలకు చెందిన అధికారులు సమాచార సేకరణ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఉమా మెడకు ఉచ్చు ఖాయం అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదే సమయంలో పాత టెండర్ల పునఃపరిశీలన పేరుతో కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. గతంలో టెండర్లు పూర్తయ్యి... ఇప్పుడు పనులు జరుగుతున్న వేల కోట్ల టెండర్లను థర్డ్ పార్టీ ద్వారా విచారణ చేయిస్తామని సిఎం చెపుతున్నారు. దీంతో ఏయే పనులపై విచారణ జరగనుంది... ఆ ప్రభావం అప్పటి మంత్రి, అధికారులపై ఎంతమేర ఉటుందనేది కూడా చర్చకు దారి తీస్తుంది. 
 
ఇక ఇరిగేషన్‌కు సంబంధించి పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టుల విషయంలో జరిగిన కొన్ని పక్కా అక్రమాల సమాచారం ఇప్పటికే కేంద్రానికి చేరినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలతో పాటు కీలక శాఖల అధికారులు ఆమేరకు సమాచార సేకరణ కూడా ప్రారంభిచారని విస్తృత ప్రచారం జరుగుతోంది. కేంద్ర గత ప్రభుత్వ పెద్దలను కొడితే మొదటి దెబ్బ దేవినేని పైనే జరుగుతుందని రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ జరగుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు