కమలనాధులు ఉత్తరాదిన మహా పవర్ ఫుల్ గా ముందుకు వెళ్లగలుగుతున్నారు కానీ దక్షిణాదిలో మాత్రం వల్లకావడంలేదు. కర్నాటకలో పాగా వేసినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మైండ్ గేమ్ తో చేతులారా పీఠాన్ని వదిలేసుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు వారి చూపు దక్షిణాదిలో అత్యధిక పార్లమెంటు స్థానాలు కలిగిన తమిళనాడుపై పడింది. మరీ ఇప్పుడు జయలలిత కోర్టు కేసుల్లో ఇరుక్కుని విలవిలలాడుతుండగా, డీఎంకే చుక్కాని లేని నావలా నడిసముద్రంలో ఉన్నట్లు ఉంది.
ఈ స్థితిని తమకు అనుకూలంగా మలచుకోవాలని కమలనాధులు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాట టాప్ ఫాలోయింగ్ ఉన్న రజినీకాంత్ తో అనుకున్నది నెరవేర్చుకోవాలని కలలు కంటున్నారు. కానీ రజినీకాంత్ మాత్రం తనదైన శైలిలో వారికి ఎంతమాత్రం అర్థంకావడంలేదు. మాజీ ముఖ్యమంత్రి ఆస్తుల కేసులో బెయిలుపై తిరిగి రాగానే అందరికంటే ముందుగా ఓ ఉత్తరం రాశారు.
ఆమె ఆయురారోగ్యాలతో వర్థిల్లాలంటూ కోరుకున్నారు. దాన్ని లైట్గా తీసుకున్న భాజపా రజినీకాంత్ పై అలాగే ఆశలు పెట్టుకుంది. ఐతే తాజాగా రజినీకాంత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గత యూపీఎలో హోంమంత్రిగా చేసిన చిదంబరం కుమారుడు కార్తీని పిలుపించుకుని చర్చలు జరపడంతో భాజపా నాయకులు రజినీ వైఖరితో విసిగివేసారి పోయినట్లు సమాచారం. ఇక రజినీకాంత్ ఊసే ఎత్తకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు చెపుతున్నారు.