ఆ విషయంలో సీఎం జగన్ బాగా తొందరపడ్డారా, ఏమైంది?

మంగళవారం, 5 నవంబరు 2019 (17:54 IST)
అనూహ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ అయిన విషయం తెలిసిందే. అయితే అందుకు గల కారణాలపై పలువాదనలు వినిపిస్తున్నాయి. స్థూలంగా చూచినప్పుడు ఎల్వీది స్వయంకృపరాధంగా కనిపిస్తుంటే ప్రభుత్వ చర్య తొందరపాటు నిర్ణయంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేసకులు.
 
ఎల్వీది స్వయంకృపరాధం, ఎందుకంటే?
బదిలీ విషయంలో నేడు వినిపిస్తున్న మాట ముఖ్యమంత్రి సూచన మేరకు పొలిటికల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉన్నతాధికారుల బదిలీలు చేశారు. సాధారణంగా ప్రధాన కార్యదర్శి పేరుతో జరిగే పనిని ఆయన కన్నా తక్కువ హోదా అధికారి పేరుతో జరిగింది. తనకు సమాచారం లేకుండా నిర్ణయం తీసుకున్న ప్రవీణ్‌కు ఎల్వీ నోటీసు ఇచ్చారు. 
 
రాజ్యాంగ , చట్టానికి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలను మినహా మిగతా అంశాలలో ముఖ్యమంత్రి నిర్ణయాలను ప్రధాన కార్యదర్శి ప్రశ్నించలేరు. బదిలీలు అన్నది ముఖ్యమంత్రి విచక్షణకు సంబంధించిన విషయం. కారణం ఏమైనా తనకన్నా క్రింద స్థాయి అధికారి ప్రవీణ్ ప్రకాష్‌కు కొంతమంది అధికారులను బదిలీ చేయమని ముఖ్యమంత్రి ఆదేశించారు. వారు అమలు చేశారు. ఈ సమయంలో ఎల్వీ చేయాల్సింది నేరుగా ముఖ్యమంత్రికి తన అభ్యంతరాన్ని తెలపడం. 
 
ఎందుకంటే ముఖ్యమంత్రి సలహా మేరకు ప్రవీణ్ బదిలీలు చేశారు. అందుకు భిన్నంగా ఎల్వీ ప్రవీణ్‌కు నోటీసు ఇచ్చారు. ఒకరకంగా ముఖ్యమంత్రికే నోటీసు ఇచ్చినట్లు అయింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి ఎల్వీ చర్యలపై మౌనం వహిస్తే పాలనలో ధిక్కార స్వరాలు వస్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
 
ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించిన విషయం తెలిసి కూడా తనకన్నా తక్కువ స్థాయి అన్న కోణంలో ప్రవీణ్ ప్రకాష్‌కు నోటీసు ఇవ్వడం కారణంగా నేడు ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ కావడం స్వయంకృపరాధం అనక తప్పదంటున్నారు విశ్లేషకులు.
 
ప్రభుత్వ నిర్ణయం కూడా తొందరపాటేనన్న వాదక వినిపిస్తోంది. అదే సమయంలో ఎల్వి ఎంపిక, బదిలీ విషయంలో ప్రభుత్వం తొందరపడింది అని చెప్పక తప్పదంటున్నారు విశ్లేషకులు. ప్రధాన కార్యదర్శిని బదిలీ, ఎంపిక చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉన్నది. కానీ తన తర్వాత ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడం, పర్యవేక్షణ చేయడం కార్యదర్శి చేస్తారు. అంతటి కీలక అధికారిని నియమించేటప్పుడు తన ఆలోచనలు, ప్రాధాన్యతలను అమలు చేయడం ముఖ్యంగా తన మనసెరిగిన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి. 
 
బదిలీ చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేయడం సాధారణంగా జరగదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల సమయంలో నియమించిన ఎల్వి స్థానంలో కొత్త ప్రభుత్వం తనకు కావాల్సిన అధికారిని నియమించుకునే అవకాశం ఉన్నా ఎల్వినే ఎంపిక చేశారు. ఎల్వి ఎంపికను తీవ్రంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యతిరేకించారు. 
 
బాబు మీద ఉన్న కోపంతో నాడు ఎల్విని బలపరిచి అధికారంలోకి వచ్చిన తర్వాత వారినే కొనసాగించారు. మరికొద్ది నెలల్లో పదవీ విరమణ చేయబోయే ముందు బదిలీ చేసి విమర్శలు కొని తెచ్చుకున్నారు. అధికారుల బదిలీలను సాంప్రదాయానికి భిన్నంగా ముఖ్యమంత్రి పొలిటికల్ కార్యదర్శికి అప్పగించారు. ఈ చర్యలతో కార్యదర్శికి ముఖ్యమంత్రి మధ్య ఉన్న అగాధాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాంటి సమయంలో వెంటనే కార్యదర్శిని బదిలీ చేసి ఉండాలంటున్నారు విశ్లేషకులు.
 
అందుకు భిన్నంగా అధికారం ఉన్నా సాంప్రదాయాలకు భిన్నంగా కార్యదర్శిని పక్కన పెట్టి వారికన్నా తక్కువ స్థాయి అధికారితో బిజినెస్ రూల్సులో మార్పులు, అధికారుల బదిలీలు చేయడం, అందుకు ప్రతిగా ఎల్వి.. ప్రవీణ్‌కి నోటీసు ఇవ్వడం ఫలితంగా సాధారణంగా జరగని విధంగా కార్యదర్శిని బదిలీ చేసి విమర్శలు తెచ్చుకోవడం అధికార పార్టీ తొందరపాటు నిర్ణయాలతో కొని తెచ్చుకొన్న సమస్యలు అని చెప్పక తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తమ్మీద ఎల్వి సుబ్రమణ్యం బదిలీ, రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చకు దారితీస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు