విభజన చేస్తే చాలు తెలంగాణ మనదే అనుకున్న కాంగ్రెస్ పార్టీకి టి ప్రజలు షాకిచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి వేరే చెప్పక్కర్లేదనుకోండి. పూర్తిగా భూస్థాపితం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగింది. అసలు ఇంతకంటే ముందే కాంగ్రెస్ పార్టీ తప్పిదం చేసిందని అప్పుడే వాదనలు వినిపించాయి. అదేమంటే... ఏపీకి జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించి ఉంటే విభజన సమస్యతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇరు ప్రాంతాల్లో పటిష్టమైన స్థితిలో ఉండేదని యువ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పుడు వ్యాఖ్యానిస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. త్వరలో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణలో, ఏపీలో పార్టీ పరిస్థితిపై ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది.
వైఎస్ మరణం తర్వాత రోశయ్యను ముఖ్యమంత్రి చేసినప్పటికీ ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టకుండా ఉండాల్సిందని రాహుల్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యలను బట్టి ఆ స్థానంలో జగన్ మోహన్ రెడ్డిని కూర్చోబెడితే పార్టీ పరిస్థితి ఇంత అధ్వాన్నంగా తయారయ్యేది కాదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.