వైఎస్సార్ కాంగ్రెస్లోకి బొత్స సత్యనారాయణను చేర్చుకోవడం అనే నిర్ణయం విజయనగరం జిల్లా వైకాపా రాజకీయాల్లో ముసలం పుట్టించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆ జిల్లాలో సీనియర్ నాయకుడు అయిన సుజయకృష్ణ రంగారావు దీనిపై అప్పట్లోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీనుంచి వెళ్లిపోతారనే వార్తలు వచ్చాయి. కొన్నాళ్లకు జగన్ పిలిచి బుజ్జగించారు. కానీ ఇప్పుడు తెదేపా ఆకర్ష మంత్రం వారి మీద పనిచేసినట్లుంది.
తాజాగా ఆయన మంగళవారం విజయవాడకు వచ్చి చంద్రబాబును కలిసి వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈనెల 15 లేదా 17న ముహూర్తం నిర్ణయించుకుని పార్టీలోకి వస్తానంటూ చంద్రబాబుకు సమాచారం ఇచ్చి వెళ్లినట్లు తెలుస్తోంది. జ్యోతుల తరహాలోనే… బొబ్బిలినియోజకవర్గ పరిధిలోని యావత్ వైకాపా కేడర్తో సహా తెదేపాలోకి వస్తానని సుజయకృష్ణ రంగారావు చంద్రబాబుతో చెప్పినట్లు తెలుస్తోంది.
మరోవైపు టీడీపీ ఆకర్ష్ విధానానికి చెక్ పెట్టే దిశగా వైకాపా అధినేత జగన్ కొత్త ప్లాన్ చేశారు. అందరినీ కలుకుపోయేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీ రాత్రి పులివెందులలోని సొంత ఇంట్లో "ఆత్మీయవిందు'' పేరుతో ఓ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ విందుకు సొంత జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులను ఆహ్వానించారు. ఈ వింత పరిణామం చూసి కొందరు నేతలు షాకయ్యారట.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి జగన్ మాట్లాడారట. వలస పోవాలన్న ఆలోచనను విరమించుకోవాలని కోరారట. సొంత జిల్లాలో తమ పరువు కాపాడాలని మరోసారి సహచర ప్రజాప్రతినిధులను రిక్వెస్ట్ చేశారట. రాష్ట్రంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జగన్ రకరకాల మార్గాల్లో రాయబారాలు కూడా నడుపుతున్నారట. అయినా జగన్ వ్యూహాలు ఫలించకపోవడంతో తలపట్టుకుని కూర్చున్నారట.