రాయపాటి - మురళీమోహన్ మధ్య రచ్చ.. ఎందుకు..?

సోమవారం, 15 మే 2017 (12:49 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పోస్టు కాస్త ఇద్దరు తెదేపా సీనియర్ నేతల మధ్య గొడవకు దారితీస్తోంది. ఎప్పటి నుంచో తితిదే ఛైర్మన్ పదవి తనదేనంటూ ధీమాతో ఉన్న గుంటూరుకు చెందిన రాయపాటి చివరకు సినీనటుడు మురళీ మోహన్ అడ్డు రావడంతో ఏం చేయాలో తెలియక తనకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే మురళీమోహన్ మాత్రం ఆ పదవి తనకేనంటూ, బాబు తన స్నేహితుడు కాబట్టి.. ఇక దీనిపై మాట్లాడిన అవసరం లేదంటూ తన సన్నిహితులతో చెప్పారట. అయితే తాజాగా సీఎం అమెరికా పర్యటన నుంచి వచ్చినవెంటనే ఇద్దరూ మరోసారి వెళ్ళి కలిసి పదవి కోసం అర్జీలు పెట్టుకున్నారట.
 
తితిదే ఛైర్మన్‌గా చదలవాడ కృష్ణమూర్తి పదవీ కాలం ముగిసిన వెంటనే ఆ పదవి కోసం పోటీలు పడే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. మంత్రిగా అవకాశం లభించని వారు తితిదే ఛైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అందులో చిత్తూరు జిల్లాకు చెందిన గాలిముద్దుక్రిష్ణమనాయుడు, జ్యోతుల నెహ్రూ మిగిలిన కొంతమంది. అయితే అంతకుమందు నుంచే పదవి కోసం ఖర్చీఫ్‌ వేశారు రాయపాటి, మురళీమోహన్‌లు. 
 
కానీ పోటీ పడిన వారిలో చాలామంది సైలెంట్ అయిపోయారు కానీ చివరకు ఇద్దరి మధ్యే పోటీ కనబడుతోంది. వారే రాయపాటి, మురళీమోహన్. వీరిద్దరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది... అంత వైరం ఉందన్నమాట. ఈ మధ్య ఒకరికి ఒకరు ఎదురుపడ్డారట. అయితే ఎడమొఖం, పెడ మొఖం లాగా పెట్టుకుని వెళ్ళిపోయారట. వీరి మధ్య గొడవ ప్రస్తుతం తెలుగు దేశంపార్టీలో హాట్ టాపిక్‌గా మారుతోంది. 

వెబ్దునియా పై చదవండి