కర్ణాటకలో వరుసగా తల నరుకుడు హత్యలకు కారణం అదేనంట..?

సోమవారం, 1 అక్టోబరు 2018 (11:31 IST)
కర్ణాటక రాష్ట్రంలో ఒకేకరమైన హత్యలు కలవరం కలిగిస్తున్నాయి. నెల రోజులలో చిక్ మంగళూరు, కోలారు, మాండ్యా జిల్లాలలో జరిగిన హత్యలలో హంతకులు తల నరికిన తరువాత తలను తీసుకువెళ్ళి పోలీస్టేషన్లలో లొంగిపోయారు. వరుసగా జరుగుతున్న సంఘటనలు కలవరం కలిగిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. ప్రతికారేచ్ఛ స్థాయి స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోందంటున్నారు.
 
సెప్టెంబర్ 10 వతేది 
కర్నాటకలోని చిక్ మంగళూరు జిల్లా తాలుకా శివమొగ్గలో భార్య మంజుల తల నరికి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు భర్త  సతీష్. 10 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు వీరిద్దరు. అయితే ఈమధ్య కాలంలో మంజుల ఇతరులతో అక్రమ సంబంధం కలిగి వుందని పలుమార్లు ఇంట్లో గొడవలు జరిగాయి. ఈ నేపధ్యంలో జరిగిన గొడవలో భార్య తల నరికి దారుణంగా చంపి తలను ఓ బ్యాగులో తీసుకు వచ్చి స్టేషన్లో లొంగిపోయాడు.
 
సెప్టెంబర్ 27 వతేది
చిక్ మంగళూరు తాలుకా మురుగుమళ్ళ సమీపంలో భార్య రోషిని తల నరికి చంపిన భర్త తలతో స్టేషన్లో‌కి వచ్చి లొంగిపోయాడు సద్దాం. రోషీణి ఎంతగానో ప్రేమించి రెండో వివాహం చేసుకున్నాడు సద్దాం. రెండు సంవత్సరాల క్రితం వీరికి వివాహం అయ్యింది. కాని అమె అక్రమ సంబంధం కలిగి వుందని అనుమానంతో అమె తల నరికి చంపి తర్వాత తలను తీసుకు వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
 
సెప్టెంబర్ 29
మాండ్యా జిల్లా మల్లపల్లి గ్రామంలో తల్లితో అసభ్యంగా ప్రవర్తించాడని గీరిష్ అనే వ్యక్తిని చంపి అతని తలను తీసుకుని బహిరంగంగా గ్రామంలో తీసుకువచ్చి పోలీసులకు లొంగిపోయాడు హంతకుడు పశుపతి. అయితే స్థానికులు చెబుతున్న దాని ప్రకారం తన తల్లితో అక్రమ వ్యవహారం నడుపుతున్న గీరిష్‌తో పలుమార్లు పశుపతి గొడవలు పడ్డాడు. చివరకు భరించలేక తల నరికి చంపుతానని స్నేహితుల ఎదుట చాలెంజ్ చేసి మరీ చంపాడు. ఇదే విధంగా పైరెండు హత్యలలో కూడా అక్రమ సంబంధం కారణంతో భరించలేని కోపంతో వారు సమాజం అందరికి తెలిసిపోయినప్పడు తనలో పౌరుషం వుందని నిరూపించుకోవడానికి హత్య చేసిన తర్వాత తలతో స్టేషన్‌కు వచ్చి వుంటారని బావిస్తున్నారు.
 
పై మూడు ఘటనలలో ఓ మానియాలా హత్యలు జరిగాయి. అన్ని హత్యలలో ప్రధానకారణం సంబంధం లోని వక్రమార్గమమే కావడం గమనార్హం.
 
 
అంతే కాదు మానసిక వైకల్యం ఒక కారణమైతే చట్టం పట్ల భయం లేకపోవడం మరో కారణం. ఒక నేరం చేస్తే దేశంలో సులభంగా తప్పించుకోవచ్చు అన్న అభిప్రాయం ప్రతి చోటా ఉంది. మనదేశంలో ఒక నేరస్థుడికి శిక్ష పడాలంటే సంవత్సరాల తరబడి సమయం పడుతోంది. ఆలస్యమైన సమయంలో సాక్షుల్ని, సాక్షాలను, ఆధారాలను తారుమారు చేసి తప్పించుకునే ప్రయత్నం జరుగుతోంది. పోలీసుల్లో ఉన్న అవినీతి, కోర్టులో జరుగుతున్న ఆలస్యం నేరస్తులకు అంతర్లీనమైన ప్రేరకంగా పనిచేస్తోందని చెబుతున్నారు విశ్లేషకులు.
 
వ్యక్తిత్వాన్ని పెంచేది కుటుంబం, వివేకాన్ని పెంచేది విద్యాసంస్ధలు, వ్యక్తిని నియంత్రించి సరిదిద్దేవి రక్షణశాఖ మూడు వ్యవస్థలు విఫలమైనప్పుడు రక్షించేంది కోర్టులు. తల్లిదండ్రులు పిల్లల పెంపకాలను పట్టించుకోవడం లేదు. చాలామంది లోపభూయిష్టమైన కుటుంబ పరిస్థితులను కల్పిస్తున్నారు. విద్యాసంస్ధల ర్యాంకుల మోజులో పడి నైతిక విలువలు, వ్యక్తిత్వ నిర్మాణం చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయి. పోలీసులు లంచాలు, అవినీతికి మరిగి కేసులను తారుమారు చేసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోర్టులకు వెళితే తక్షణ న్యాయం జరగడమే లేదు.
 
ఈ దశలో వ్యక్తులు భయపడటం మానేశారు. దీనికితోడు వారిలో ఉన్న మానసిక లోపాలు, రుగ్మతలు, విపరీత ధోరణికి హింసా ప్రవృత్తికి కారణమవుతున్నాయి. కాబట్టి వ్యవస్ధలోని లోపాల వల్ల వ్యక్తిత్వాన్ని పాడు చేసుకున్న వారికి తప్పనిసరిగా మానసిక చికిత్స అవసరం. అంటే సామాజిక పరిస్థితులను మార్పు చేయడం వ్యక్తుల్లో ఉన్న మానసిక రుగ్మతలను తగ్గించడం ద్వారానే ఇలాంటి అసాంఘిక పైశాచిక హింసాప్రవృత్తులకు చరమగీతం పాడొచ్చంటున్నారు విశ్లేషకులు. మరి ఇది సాధ్యమవుతుందో లేదో వేచి చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు