దీపావళి పండుగ... మీరు బంధువుల ఇంటికి వెళుతున్నారా..?!!
సోమవారం, 12 నవంబరు 2012 (17:41 IST)
FILE
ఎటు చూసినా దీపాల కాంతులు, కొత్త దుస్తులు, మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవడాలు, మతాబుల వెలుగుల దీపావళి సందడి సంకేతాలు. ఈ పండుగ ఎంత సరదాగా సాగుతుందో అంత హడావుడి సృష్టిస్తుంది. దీపావళి పండుగ కోటి దివ్వెల కాంతులతో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా మధుర స్మృతిగా సాగాలంటే కొంత సాధన తప్పదు. పండుగ ముగిశాక లాభనష్టాల్ని బేరీజు వేసుకునే కంటే ముందే జాగ్రత్తలు తీసుకోవాలి.
దీపావళి అనగానే మతాబులు, వాటి సరసనే మిఠాయిలు గుర్తుకు వస్తాయి. బంధుమిత్రుల ఇళ్ళకు వెళ్ళో, పలకరింపుగానో దీపావళి నాడు పరస్పరం మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీ. మన ఇంటికి ఎవరైనా వస్తే వారికి తీపి తినిపించాలి. మనం తినాలి. మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడూ అంతే. తినకపోతే పెట్టినవారికి కోపం. తింటే ఆపై క్యాలరీల మోత. మరి ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలి. సింపుల్ సూత్రం. అమ్మమ్మకో నాయనమ్మకో డయాబెటిస్ వుంది కాబట్టి తీపి తగ్గించమని మాట తీసుకుందంటూ మాటల మధ్య ముందే ఓ ముక్క చెప్పేసి ఊరుకుంటే కోపాలు, నిష్టూరాల బెడద తగ్గుతుంది.
ఇళ్ళ మధ్య చివరకు ఆకాశ హర్మ్యాల, బాల్కనీల నుంచి ఆగాగి అర్థరాత్రి దాకా వినిపించే టపాకాయల శబ్దాలు విసుగు పుట్టిస్తుంటాయి. పైగా రీసౌండ్ చేసి మరీ బాధిస్తాయి. ఈ బాధను తప్పించుకోవాలంటే కాలనీవాసులు లేదా అపార్టుమెంట్ నివాస పరిసరాల్లోని ఖాళీ ప్రదేశంలో లేదా టెర్రాస్ పైన అంతా కలసి టపాసులు కాల్చుకుంటే శబ్దాల చిరాకు వుండదు. సరదాగానూ వుంటుంది. అంతా ఒకేసారి విరమిస్తారు కాబట్టి దగ్గర్లో అర్ధరాత్రి మోతలు వుండవు.
గతంలో పండుగ అంటే కుటుంబసభ్యులంతా కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సందడిగా గడిపేవారు. ఇప్పుడా సంప్రదాయం పోయి దాని స్థానంలో ఆర్భాటాలు చోటు చేసుకుంటున్నాయి. సహాయాలు, కబుర్లు తగ్గి బహుమతులిచ్చి పుచ్చుకోవడాలు మొదలయ్యాయి. దీనివల్ల వృథా ప్రయాసలు. కష్టపడి సంపాదించే సొమ్ముతో అనవసర ఆర్భాటాలకు తావిచ్చి, ఆ తర్వాత పండుగ మధుర స్మృతుల్ని నెమరువేసుకునే అవకాశాల్ని ఖర్చులతో మింగేయ కూడదు. బంధుమిత్రులు కలవడమే దీపావళి పండుగ విశేషం అయినప్పుడు దానికి బహుమతులు, స్వీట్ల జత ఇంకెందుకు.