బాబు దయతోనే పురంధేశ్వరికి సీటు...? కమలం కరుణించినా సైకిల్ ఏం చేస్తుందో...?

బుధవారం, 2 ఏప్రియల్ 2014 (12:38 IST)
WD
యూపీఎ 1, 2లలో కేంద్రమంత్రిగా చక్రం తిప్పిన దగ్గుబాటి పురంధేశ్వరికి విచిత్ర పరిస్థితి ఎదురవుతున్నట్లుగా ఉంది. రాష్ట్ర విభజన నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీని కాదనుకుని కమలం పార్టీలో చేరిన పురంధేశ్వరికి 2014 ఎన్నికలు నేపధ్యంలో కొత్త తలనొప్పి మొదలయింది.

అదేమిటయా అంటే... భాజపాకు జంప్ చేసేటపుడు తనకు విజయవాడ లేదా విశాఖపట్టణం పార్లమెంటు సీటు కావాలనే కండిషన్ పై వచ్చినట్లు సమాచారం. అదేవిధంగా తన కుమారుడికి కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని, ఆ మేరకు కమలం బాస్ ల నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐతే తాజాగా తెలుగుదేశం పార్టీతో పొత్తు చర్చ జరుగుతుండటంతో పురంధేశ్వరి సీటు గల్లంతయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ విజయవాడ, విశాఖపట్టణం రెండింటినీ వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో పురంధేశ్వరి భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. కమలం ఎంత ఒత్తిడి తెచ్చినా ఆ రెండు స్థానాలు కేటాయింపులో తెదేపా గట్టి పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. దీంతో విశాఖ అరకు స్థానం నుంచి పోటీ చేయాలని భాజపా అధిష్టానం పురంధేశ్వరికి సూచించినట్లు సమాచారం. ఐతే విజయవాడ లేదా విశాఖపట్టణం కాకుండా ఎక్కడ పోటీ చేసినా ఆమె ఓటమి పాలవడం ఖాయమని అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి